floods: తెలంగాణతో తెగిపోయిన సంబంధాలు

ABN , First Publish Date - 2022-07-15T01:35:53+05:30 IST

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద నీరు ముంచెత్తుతోంది.

floods: తెలంగాణతో తెగిపోయిన సంబంధాలు

నరసాపురం: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను వరద నీరు ముంచెత్తుతోంది. ప్రధాన రహదారులు ఎక్కడికక్కడ నీట మునగడంతో గ్రామాలకు గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఎటువైపు నుంచి గోదావరి వరద వచ్చి పడుతుందనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. గోదావరి ముంచెత్తి ఉండటంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ మెరక ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు. అందిన కాడకు సామానులను చేత పట్టుకుని చిన్న, పెద్ద, వృద్ధులు, పిల్లలతో ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. గ్రామాల్లో పరిస్ధితి భయానకంగా మారింది. 1986 ఆగస్టు 16న వచ్చిన 75.6 అడుగుల వరదను దాటే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు అక్కడ ప్రజలను హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తుండటంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


జల దిగ్భందంలో 30 గ్రామాలు

కుక్కునూరు మండలంలో 15 పంచాయతీలుండగా 75 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 20 గ్రామాలను గోదావరి వరద ముంచెత్తడంతో వారిని సమీప పునరావాస కాలనీకి తరలించారు. అలాగే కుక్కునూరు-భద్రాచలం రహదారి 12 చోట్ల నీట మునగడంతో అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కుక్కునూరు-అశ్వారావుపేట రహదారి గురువారం రాత్రి నీట మునగడంతో తెలంగాణ వైపు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు గ్రామానికి మూడు వైపులా నీరు వచ్చి చేరుతుండటంతో జలదిగ్భందంలో ఉంది. చివరకు జిల్లా అధికారులు కుక్కునూరు రాలేని పరిస్ధితి ఏర్పడింది.

Updated Date - 2022-07-15T01:35:53+05:30 IST