తెలంగాణ ఉద్యమకారిణి వసుంధర కన్నుమూత
ABN , First Publish Date - 2021-12-29T08:19:06+05:30 IST
తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి, మహిళా నాయకురాలు బూసమల్ల వసుంధర (57) కన్నుమూశారు. పది నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు.
నేడు కార్ఖానలో అంత్యక్రియలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి, మహిళా నాయకురాలు బూసమల్ల వసుంధర (57) కన్నుమూశారు. పది నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. నిజామాబాద్కు చెందిన బూసమల్ల శ్రీనివాస్, డోనా దంపతుల కుమార్తె వసుంధరకు చిన్నప్పటి నుంచే సామాజిక సమస్యలపై స్పందించే గుణం ఉంది. హోటల్ మేనేజ్మెంట్లో ప్రావీణ్యం ఉన్న వసుంధర... దుబాయికి వెళ్లి అక్కడ కొంతకాలం పనిచేశారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో 2001లో నగరానికి వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, ఇతర సీనియర్ల నాయకత్వంలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. క్రైస్తవ సమాజం తరఫున తెలంగాణ పోరాటంలో ముందువరుస లో నిలబడి ప్రత్యేక గుర్తింపు పొందారు.
తర్వాత కాలంలో ఉద్యమకారు లకు సముచిత గౌరవం ఇవ్వడం లేదనే బాధతో ఆమె టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రె్సలో చేరారు. పేద, దళిత క్రైస్తవుల కోసం సేవాకార్యక్రమాలు నిర్వహించడంతోపాటు మా నవ హక్కుల పరిరక్షణకు కృషి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వసుంధరకు క్యాన్సర్ సోకి నట్టు నిర్థారణ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత తగ్గినట్టేనని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు సంతోషపడ్డారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వసుంధర వెన్నుపూసకు క్యాన్సర్ వ్యాపించి పరిస్థితి విషమిం చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం 11గంటలకు కార్ఖాన సీఎ్సఐ సమాధుల స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వసుంధర సోదరి సంధ్య తెలిపారు.