వారి కన్ను పడితే కబ్జా.. ఆశ పడితే ఆక్రమణ..: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-09-11T17:06:13+05:30 IST
అమరావతి: సీఎం జగన్రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు.. అధికారం ఆయుధంగా, చట్టం చుట్టంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి కన్నుపడితే కబ్జా, ఆశపడితే ఆక్రమణ.. అన్నట్టుగా
అమరావతి: సీఎం జగన్రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు.. అధికారం ఆయుధంగా, చట్టం చుట్టంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారి కన్నుపడితే కబ్జా, ఆశపడితే ఆక్రమణ.. అన్నట్టుగా తయారైందని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కబ్జాలు, ఆక్రమణలపై నిలదీస్తే.. నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థని జగన్రెడ్డి.. ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో రాక్షస రాజ్యం సాగుతోందన్నారు. కబ్జాలపై స్వయంగా వైసీపీ కార్యకర్తలే బహిరంగా చెప్పే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
కడప జిల్లా మైదుకూరులో వైసీపీ నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి.. తమ పార్టీకి చెందిన కార్యకర్త పొలాన్నే కబ్జా చేశారన్నారు. ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా దీనిపై నిలదీసినందుకు..ఎన్కౌంటర్ చేస్తామని మైదుకూరు సీఐ కొండారెడ్డి బెదిరించే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ కార్యకర్త బాషాయే వైసీపీ నేతల అరాచకాలకు తాళలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని రోధిస్తున్నారనన్నారు.
ఇక్కడే ఇలా ఉంటే.. ఇక రాష్ట్రంలో ఏ స్థాయి దౌర్జన్యాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ముస్లిం మైనారిటీలంటే సీఎం జగన్కు.. అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి అంతం చేశారని ఆరోపించారు. మరో ముస్లిం మైనారిటీ కుటుంబం ఉసురు పోసుకోవద్దని నారా లోకేష్ హితవుపలికారు.