లాక్డౌన్ పొడిగింపు సబబే: టీడీపీ
ABN , First Publish Date - 2020-04-10T07:26:02+05:30 IST
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను మరికొంత కాలం పొడిగించడమే సబబు అని టీడీపీ పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేస్తే కొత్త సమస్యలు...
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను మరికొంత కాలం పొడిగించడమే సబబు అని టీడీపీ పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితి దృష్ట్యా, నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్లోని తన నివాసం నుంచి పార్టీ పొలిట్బ్యూరో సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులను ఆదుకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తీర్మానించినట్లు తెలిపారు.వైద్యులు, వైద్యసిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దేశంలో, కరోనా తీవ్రతను, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చంద్రబాబు వివరించారని తెలిపారు.