నరకకూపాలుగా ఏపీలోని ప్రభుత్వాస్పత్రులు: Anitha
ABN , First Publish Date - 2022-04-18T19:54:20+05:30 IST
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు నరకకూపాలుగా ఉన్నాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు నరకకూపాలుగా ఉన్నాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో శిశు మరణాలన్నీ ప్రభుత్వహత్యలే అని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప రిమ్స్లో ముగ్గురు చిన్నారులు మృతి, తిరుపతి రుయాలో వారం వ్యవధిలో 16 మంది శిశువులు మృతి చెందారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యఆరోగ్యశాఖ పర్యవేక్షణా లోపమే శిశువుల మృతికి కారణమని ఆరోపించారు. తల్లిదండ్రుల కడుపుకోత వైసీపీ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వరుస ఘటనలపై ఆరోగ్యశాఖ మంత్రి ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. చిన్నారుల చావు డప్పుల మధ్యే మంత్రిగా ఎలా చార్జ్ తీసుకోగలుగుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వాసుపత్రుల్లో పర్యటిస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని అనిత వ్యాఖ్యానించారు.