జగన్ బాదుడు ముఖ్యమంత్రిగా మారిపోయారు: Pattabhi
ABN , First Publish Date - 2022-01-31T19:20:20+05:30 IST
టీడీపీ నేత వంగపూడి అనిత అధ్యక్షతన జరుతున్న నారీ సంకల్ప దీక్షకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం సంఘీభావం తెలిపారు.
అమరావతి: టీడీపీ నేత వంగపూడి అనిత అధ్యక్షతన జరుతున్న నారీ సంకల్ప దీక్షకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని కృషి చేశారన్నారు. కానీ, నేడు జగన్ రెడ్డి ఒక కాల్ మనీ వ్యాపారిగా మారిపోయారని విమర్శించారు. రేషన్ షాపుల్లోనే ధరలు పెంచిన ఘనుడు జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అన్ని కానుకల పథకాలను రద్దు చేశారన్నారు. దేశం మొత్తం పెట్రోల్ ధరలు తగ్గిస్తే జగన్ రెడ్డి తగ్గించలేదని అన్నారు. స్కూలు పిల్లల చిక్కీని కూడాను వదలకుండా మింగుతున్నాడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలపై బాదుడు కార్యక్రమం మొదలుపెట్టి బాదుడు ముఖ్యమంత్రిగా మారిపోయారు జగన్ రెడ్డి అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగు మహిళలు జగన్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాటం చేయాలని పట్టాభి పిలుపునిచ్చారు.