Chandrababu naidu: ఆధునిక భారత్ నిర్మాణంలో వాజ్పేయి కీలక పాత్ర
ABN , First Publish Date - 2022-08-16T16:35:05+05:30 IST
ఆధునిక భారత్ నిర్మాణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కీలక పాత్ర పోషించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
అమరావతి: ఆధునిక భారత్ నిర్మాణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) కీలక పాత్ర పోషించారని టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu naidu) అన్నారు. అటల్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ‘‘ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు అటల్ బిహారీ వాజపేయి. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి వర్ధంతి సందర్భంగా ఆ భారతరత్న స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వాజపేయి పాలనా కాలంలో ఊపిరిపోసుకున్న టెలికాం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం. భాగస్వామి కావడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చే అంశం. దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవే. ఆ సమయంలోనే జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలుచుకోవాల్సిన దేశభక్తుడు వాజపేయి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.