తోలుబొమ్మ మంత్రివర్గం.. కీలుబొమ్మ పాలన
ABN , First Publish Date - 2022-01-29T08:21:02+05:30 IST
‘‘రాష్ట్రంలో తోలుబొమ్మ మంత్రివర్గం.. కీలుబొమ్మ పాలన ఉంది. ఇలాంటి మంత్రివర్గం, పాలనను దేశంలో ఎప్పుడూ చూడలేదు. సలహాదారులు మాట్లాడుతుంటే... సీనియర్ మంత్రులు నోరెళ్లబెట్టడం సిగ్గుచేటు.
ఆ ఐదుగురు రెడ్లదే పెత్తనం: యనమల
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో తోలుబొమ్మ మంత్రివర్గం.. కీలుబొమ్మ పాలన ఉంది. ఇలాంటి మంత్రివర్గం, పాలనను దేశంలో ఎప్పుడూ చూడలేదు. సలహాదారులు మాట్లాడుతుంటే... సీనియర్ మంత్రులు నోరెళ్లబెట్టడం సిగ్గుచేటు. అసలు కేబినెట్ను అటకెక్కించి కిచెన్ కేబినెట్తో నడుపుతున్నారు. తాడేపల్లి కిచెన్ నుంచే జగన్ పాలన నడుస్తోంది’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు శుక్రవారం విమర్శించారు. ‘‘జగన్ చేతిలో మొత్తం అధికారాలన్నీ పెట్టుకున్నారు. ఆయన కిచెన్ కేబినెట్కే అన్ని అధికారాలు. జగన్ ముందు మే మే అనడం... బయటికొచ్చి చంద్రబాబుపై గాండ్రింపులు రెండున్నరేళ్లుగా చూస్తూనే ఉన్నాం. మంత్రుల నోళ్లు కట్టేశారు. సలహాదారులదే పెత్తనమంతా. రాష్ట్రం లోపల సజ్జల, వెలుపల విజయసాయిరెడ్డి పెత్తనం సాగిస్తున్నారు. అన్ని అంశాల్లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పెద్దిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి.. ఈ ఐదుగురు రెడ్డిలదే పెత్తనం’’ అని విమర్శించారు. ‘‘రాష్ట్రాన్ని 26 జిల్లాలు చేస్తున్నారు. ఒక్క జిల్లాకూ అంబేద్కర్ పేరు, బీసీ నేత పేరూ పెట్టలేదు. గౌతు లచ్చన్న లాంటి ఉద్దండులు బీసీల్లో ఉన్నా కనీస ఆలోచన చేయలేదు’’ అన్నారు.