స్మృతివనం తరలించొద్దంటూ టీడీపీ, దళిత నేతల మౌనదీక్ష
ABN , First Publish Date - 2020-07-09T08:35:28+05:30 IST
రాజధాని అమరావతిలో అంబేడ్కర్ స్మ్మతివనం ఉండకూడదా? అని టీడీపీ దళిత నేతలు ప్రశ్నించారు
తుళ్లూరు, జూలై 8: రాజధాని అమరావతిలో అంబేడ్కర్ స్మ్మతివనం ఉండకూడదా? అని టీడీపీ దళిత నేతలు ప్రశ్నించారు. బుధవారం శాఖమూరులోని స్మృతివనం వద్ద రాజధాని దళిత జేఏసీ నేతలు మౌన దీక్ష చేశారు. ఈ దీక్షకు టీడీపీ నాయకులు వర్ల రామయ్య, తెనాలి శ్రావణ్కుమార్, నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. శాఖమూరులో అంబేడ్కర్ స్మ్మతివనం ఫౌండేషన్ పనులు పూర్తయ్యే దశలో వైసీపీ ప్రభుత్వం విజయవాడకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ స్మృతి వనానికి టీడీపీ ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించగా, వైసీపీ ప్రభుత్వం విజయవాడలో మొక్కుబడిగా రెండెకరాలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని వర్ల రామయ్య విమర్శించారు. దళితులున్న నియోజకవర్గంలో రాజధాని ఉండకూడదని సీఎం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని శ్రావణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో అంబేడ్కర్ ఉనికే లేకుండా చేయాలని సీఎం జగన్ స్మృతివనం తరలింపు చేపట్టారని నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నేతలు మౌన దీక్ష చేశారు.