ఏపీలో పన్నుల బాదుడుపై పౌరుడి ఆవేదన...చంద్రబాబు ట్వీట్
ABN , First Publish Date - 2022-04-28T13:46:02+05:30 IST
ఏపీలో మునిసిపాలిటీ పన్నుల బాదుడుపై ఓ పౌరుడి ఆవేదనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
అమరావతి: ఏపీలో మునిసిపాలిటీ పన్నుల బాదుడుపై ఓ పౌరుడి ఆవేదనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పన్నుల బాదుడు ఎలా ఉందో వివరిస్తూ ఓ విజయవాడ వాసి చెప్పిన వాయిస్ మెసేజ్ను టీడీపీ అధినేత ట్వీట్ చేశారు. ‘‘మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా! ఇదేం బాదుడు... ఇదేం పాలన? పన్ను పోటుపై ప్రజల ప్రశ్నలకు బదులివ్వండి... లేదా అసత్య హామీలు, నిత్య మోసాలపై క్షమాపణలు చెప్పండి’’ అంటూ బాబు డిమాండ్ చేశారు.
పౌరుడి వాయిస్ మెసేజ్ ఏంటంటే?....
రూ.3000 వేల ఇంటి పన్నును రూ.5700కు చేరడంపై వివరాలను ఓ పౌరుడు వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేశాడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, లైబ్రరీ టాక్స్, అనాథరైజ్డ్ పెనాలిటీ, టాక్స్ ఎరియర్స్ ఇంట్రస్ట్ పేరుతో తనకు పన్నులు ఎలా వడ్డించారో విజయవాడ వాసి వివరించాడు. భారీగా పెరిగిన పన్నులతో పేద, మధ్య తరగతిపై పడుతున్న భారం అంటూ వాయిస్ మెసేజ్ పెట్టాడు. విజయవాడ వాసిగా తన విన్నపాన్ని మన్నించి పన్నుల బాదుడు నుంచి రక్షించాలని ప్రభుత్వానికి వాయిస్ మెసేజ్ ద్వారా విన్నవించారు. అదే మెసేజ్ను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.