తానా ప్రపంచ సాహిత్య వేదిక.. మహాకవి శ్రీనాధ సాహిత్య వైభవంపై చర్చ

ABN , First Publish Date - 2021-11-03T18:51:53+05:30 IST

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో 20వ “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం అంతర్జాలంలో ఘనంగా జరిగింది.

తానా ప్రపంచ సాహిత్య వేదిక.. మహాకవి శ్రీనాధ సాహిత్య వైభవంపై చర్చ

శ్రీనాధ మహాకవి సాహిత్య వైభవంపై పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్ అద్భుత ప్రసంగం

అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో 20వ “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం అంతర్జాలంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా న్యూజెర్సీ రాష్ట్ర పూర్వ శాసన సభ్యుడు, ప్రస్తుత న్యూజెర్సీ రాష్ట్ర యుటిలిటీస్ బోర్డు కమీషనర్ ఉపేంద్ర చివుకుల, కెనడాలోని అల్బర్టా రాష్ట్ర మౌలిక వసతుల శాఖామంత్రిగా ఉన్న ప్రసాద్ పండాలను తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా విదేశాలలో ఉంటున్న వీరిద్దరూ ఇప్పటికీ మాతృ భాషమీద పట్టు కోల్పోకుండా తెలుగులో ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా వీరివురు తెలుగు భాషా పరిరక్షణకు అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు. 


ఎంతో విలువైన వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సంపదను భావితరానికి భద్రంగా అందించే కృషిలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రాచీన సాహిత్యంపై సదస్సు నిర్వహించడం ముదావహం అన్నారు. శ్రీనాధ మహాకవి కాశీ పట్టణం స్వయంగా పర్యటించి “కాశీ ఖండం” అనే మహాకావ్యం రచించి 600 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ డా. మేడసాని మోహన్ శ్రీనాధ మహాకవి సార్వభౌమ కవితా వైభవంపై ప్రత్యేక చర్చ నిర్వహించారు. విద్యానగర సంస్థానంలోని ప్రఖ్యాత పండితుడైన డిండిమ భట్టును ఓడించడం, ఎన్నెన్నో గొప్ప రచనలు చేయడం, ఎంతోమంది రాజులు, సంస్థానాదీశుల నుండి లెక్కకు మించిన సన్మానాలు పొందడం ప్రశంసనీయం అన్నారు. కానీ, చివరి దశలో అంతా పోగొట్టుకుని సేద్యం చేసి మరింత నష్టాలపాలై ఆర్ధిక బాధలతో కన్నుమూయడం బాధకరమని పేర్కొన్నారు.


శ్రీనాధ మహాకవి పాండిత్యంపై దాదాపు గంటన్నర పైగా సాగిన అవధాని మేడసాని ప్రసంగ ఝరిలో అందరూ తడిసి ముద్డైయ్యారని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పుంభావ సరస్వతి అన్నారు. లక్షన్నరకు పైగా పద్యాలను ధారణ చేసినట్టి పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్ గారికి తానా ప్రపంచ సాహిత్య వేదిక తరపున నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన వివిధ ప్రసార మాధ్యమాలకు ప్రత్యేక ధన్యవాదములను తెలియజేశారు. పూర్తి కార్యక్రమాన్ని https://youtube.com/embed/MZQoYmsvWiA యూట్యూబ్ లింక్‌లో చూడవచ్చు.



Updated Date - 2021-11-03T18:51:53+05:30 IST