తమ్మారెడ్డికి ‘స్వరలయ’ పురస్కారం
ABN , First Publish Date - 2022-04-18T09:05:42+05:30 IST
తమ్మారెడ్డికి ‘స్వరలయ’ పురస్కారం
తెనాలి టౌన్, ఏప్రిల్ 17: కళల కాణాచిగా పేరొందిన తెనాలి గడ్డపై తెలంగాణ నుంచి వచ్చి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో సాహితీ, సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక 23వ వార్షికోత్సవం, ఉగాది పురస్కార కార్యక్రమాన్ని ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భరద్వాజకు స్వరలయ జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. భరద్వాజ మాట్లాడుతూ, సన్మానం అందుకోవడం కంటే ఇతరులను సత్కరించడంలోనే ఎక్కువ ఆనందపడతానన్నారు. కవులు, సాహితీ ప్రియులు అందరూ తెనాలి సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ దిశలో తనవంతు పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.