బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె

ABN , First Publish Date - 2021-12-04T07:47:34+05:30 IST

బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల 9 నుంచి మూడురోజుల పాటు సమ్మె చేపట్టాలని తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘంతో పాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు(ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌)లు నిర్ణయించాయి.

బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె

  • కార్మిక సంఘాల నిర్ణయం
  • సమ్మె ప్రగతికి విఘాతం, విరమించుకోండి
  • సింగరేణి యాజమాన్యం 

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల 9 నుంచి మూడురోజుల పాటు సమ్మె చేపట్టాలని తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘంతో పాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు(ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌)లు నిర్ణయించాయి. ఆమేరకు నోటీసును కూడా ఇచ్చాయి. దీంతో శుక్రవారం సాయంత్రం సింగరేణి యాజమాన్యం ఆయా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరిపింది. బొగ్గు బ్లాకుల వేలం కేంద్రప్రభుత్వ నిర్ణయమని, సింగరేణికి సంబంధం లేనందున సమ్మె చేయొద్దని విజ్ఞప్తిచేసింది.


రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేయకుండా అడ్డుకునేందుకు చివరిదాకా ప్రయత్నించినా సాధ్యం కాలేదని వారికి గుర్తు చేసింది. ఆ బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారని అధికారులు కార్మిక సంఘాలకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె ప్రగతికి విఘాతాన్ని కలిగిస్తుందని హితవుచెప్పారు. అయితే.. కార్మిక సంఘాలకు వాటి నిర్ణయాన్ని మార్చుకునే యోచన లేదని తెలుస్తోంది. నాలుగు బ్లాకుల వేలంతో సింగరేణి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేలంలో ఎవరు దక్కించుకోవాలని చూసినా సంఘటితంగా అడ్డుకుంటామని హెచ్చరించాయి. సమ్మెకు యాజమాన్యం కూడా సంఘీభావం తెలపాలని సూచించాయి. ఇదిలా ఉండగా.. కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్‌ నిర్మాణం కోసం శుక్రవారం దక్షిణ మధ్య రైల్వేకు సింగరేణి రూ.62.17 కోట్ల చెక్కును అందించింది. 

Updated Date - 2021-12-04T07:47:34+05:30 IST