కథా రచయిత కరుణాకర్ కన్నుమూత
ABN , First Publish Date - 2020-07-21T08:57:32+05:30 IST
ప్రముఖ రచయిత, బీహెచ్ఈఎల్ విశ్రాంత ఉద్యోగి బండారు కరుణాకర ప్రసాద్ (77) కన్నుమూశారు.
హైదరాబాద్ సిటీ, జూలై20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, బీహెచ్ఈఎల్ విశ్రాంత ఉద్యోగి బండారు కరుణాకర ప్రసాద్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు. బీహెచ్ఈఎల్ సంస్థ ఫైనాన్స్ శాఖలో మేనేజర్గా 2004లో పదవీ విరమణ చేశారు. ‘బీపీ కరుణాకర్’ అనే కలం పేరుతో కథా రచనలు చేసిన ఆయన.. ‘కార్డు’ కథలు, ‘కాలమ్’ కథలు వంటి వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఆయన కలం నుంచి ‘అంబాలిస్’, ‘నిర్నిమిత్తం’, ‘రెల్లు’, ‘డియర్’, ‘రజితం’ వంటి పలు కథాసంపుటిలు వెలువడ్డాయి. మరెన్నో కథలు పలు వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మంగళవారం బోయిగూడలోని శ్మశాన వాటికలో బీపీ కరుణాకర్ అంత్యక్రియలు జరగనున్నాయి.