టీడీపీతోనే ఉంటా: క్లారిటీ ఇచ్చిన గల్లా అరుణ
ABN , First Publish Date - 2020-10-02T01:23:04+05:30 IST
వ్యక్తిగత కారణాలతోనే టీడీపీ పొలిట్బ్యూరోకి రాజీనామా చేశానని ఆ పార్టీ నేతల గల్లా అరుణ తెలిపారు. పార్టీలు మారే తత్వం తమది కాదని స్పష్టం చేశారు.
తిరుపతి: వ్యక్తిగత కారణాలతోనే టీడీపీ పొలిట్బ్యూరోకి రాజీనామా చేశానని ఆ పార్టీ నేత గల్లా అరుణ తెలిపారు. పార్టీలు మారే తత్వం తమది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేకుండాపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే టీడీపీలోకి వచ్చామని, ఎక్కడ ఉన్నా నిబద్ధతతోనే ఉంటామని చెప్పారు. టీడీపీతోనే ఉంటా.. ఎక్కడికి వెళ్లనని గల్లా అరుణ స్పష్టం చేశారు. మంచి వారిని పెట్టుకోవడానికి తమ నేతకు వెసులుబాటు ఇచ్చి.. సహకరించాలనే రాజీనామా చేశానని గల్లా అరుణ ప్రకటించారు.
టీడీపీ పొలిట్బ్యూరోకు గల్లా అరుణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామాను అరుణకుమారి పంపారు. సుధీర్ఘకాలం అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అరుణకుమారి కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో ఆమె తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ అరంగ్రేటం చేశారు. టీడీపీ తరపున గుంటూరు నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా గుంటూరు నుంచి తిరిగి పార్లమెంట్కు జయదేవ్ ఎన్నికయ్యారు.