స్పీకర్ రాజ్యాంగేతరశక్తిగా భావిస్తున్నారు: సబ్బం హరి
ABN , First Publish Date - 2020-07-04T00:02:25+05:30 IST
స్పీకర్ తమ్మినేని సీతారాం తనను తాను రాజ్యాంగేతరశక్తిగా భావిస్తున్నారని, స్పీకర్ పదవికి ఉన్న హుందాతనాన్ని కాపాడాలని మాజీ ఎంపీ సబ్బం హరి హితవుపలికారు.
అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాం తనను తాను రాజ్యాంగేతరశక్తిగా భావిస్తున్నారని, స్పీకర్ పదవికి ఉన్న హుందాతనాన్ని కాపాడాలని మాజీ ఎంపీ సబ్బం హరి హితవుపలికారు. అంతగా మాట్లాడాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఇష్టంవచ్చినట్టు మాట్లాడాలన్నారు. ఎన్నడూ లేనివిధంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల తీర్పులు వస్తున్నాయని తెలిపారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేంగా నిర్ణయాలు తీసుకుంటే కోర్టులకు వెళ్తారని, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకుంటాయని పేర్కొన్నారు. తప్పుడు నిర్ణయాలపై స్టేలు ఇచ్చి సరిదిద్దుకోమని కోర్టులు చెబుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కోర్టులకు లేదు కానీ... అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సబ్బం హరి సూచించారు. కోర్టులపై బురదజల్లి భయపెట్టాలని వైసీపీ నేతల ప్రయత్నాలు చేస్తున్నారని, న్యాయవ్యవస్థకు ప్రజలు, మేధావులు అండగా ఉండాలని సబ్బం హరి కోరారు.