గంగూలీని వదలని కరోనా.. ఈసారి డెల్టా ప్లస్ వేరియంట్
ABN , First Publish Date - 2022-01-02T03:13:10+05:30 IST
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీని కరోనా వీడడం లేదు. వైరస్ బారినపడి ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు
కోల్కతా: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీని కరోనా వదలడం లేదు. వైరస్ బారినపడి ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొందిన తర్వాత కోలుకున్న గంగూలీ నిన్న (శుక్రవారం) డిశ్చార్జ్ అయ్యాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ‘దాదా’కు డెల్టాప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గంగూలీకి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి పేర్కొంది.
ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో గత సోమవారం రాత్రి గంగూలీ ఉడ్ల్యాండ్ ఆసుపత్రిలో చేరాడు. ఆక్కడ ఆయనకు ‘మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ థెరపీ’ అందించడంతో కోలుకున్నాడు. నాలుగు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం మరోమారు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ అని తేలడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే, పూర్తిగా కోలుకునేంత వరకు ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. తాజాగా, మరోమారు నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, ఇన్ఫెక్షన్ తీవ్రత ఆందోళన చెందే స్థాయిలో లేకపోవడంతో ఇంటి వద్దే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరో 15 రోజులపాటు గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్లో ఉంటారని అధికారి ఒకరు తెలిపారు.