ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించండి
ABN , First Publish Date - 2022-08-19T08:20:45+05:30 IST
ఎనర్జీ అసిస్టెంట్ల (జేఎల్ఎం గ్రేడ్-2) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి గురువారం లేఖ రాశారు.
సీఎం జగన్కు లోకేశ్ లేఖ
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : ఎనర్జీ అసిస్టెంట్ల (జేఎల్ఎం గ్రేడ్-2) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి గురువారం లేఖ రాశారు. వైసీపీ వచ్చాక సచివాలయ వ్యవస్థలో భాగంగా 7,329 మందిని ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్ఎం గ్రేడ్-2)గా నియమించారని తెలిపారు. సచివాలయాల్లో ఉండి పని చేయాల్సిన వీరిని విద్యుత్తు శాఖకు అండర్ టేకింగ్ చేసి.. కట్టు బానిసల్లా వాడుకుంటున్నారని వివరించారు. తగిన శిక్షణ కూడా ఇవ్వకుండా ప్రమాదకరమైన 11కె.వి., 33 కె.వి. విద్యుత్తు లైన్ల మరమ్మతుల కోసం స్తంభాలు ఎక్కిస్తుండటంతో, ఇప్పటివరకు 89 మంది ప్రమాదవశాత్తూ మరణించారని, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఇండస్ట్రియల్ యాక్ట్ కింద పని చేయాల్సిన వీరు ప్రమాదంలో చనిపోతే సచివాలయ ఉద్యోగి చనిపోయాడంటున్నారని, ఇదేం అన్యాయమని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి 7329 మంది ఎనర్జీ అసిస్టెంట్ల న్యాయమైన కోర్కెలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.