ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ..!

ABN , First Publish Date - 2022-04-12T23:18:40+05:30 IST

అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్

ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ..!

వివరాలకు వెళ్ళేముందు దయచేసి ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ మద్దతు తెలియ చేయండి: https://chng.it/nQKtBRjS


అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భముగా ఆ అమరగాయకుడికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 60 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు. అందులో బాగంగా సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు వ్యాఖ్యాతగా 2022 ఏప్రిల్ 10న జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో యు.యెస్.ఏలోని ప్రముఖ వక్త పద్మభూషణ్ డా జగదీష్ సేథ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఒక తెలుగేతర వ్యక్తిగా ఘంటసాల బహుముఖ ప్రజ్ఞని తెలుసుకొని ఆశ్చర్యపోయానని తెలిపారు.  గాయకుడిగా, సంగీత దర్శకులుగా పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా దేశానికీ ఎంతో సేవ చేసారని, భారతరత్న పురస్కారానికి ఘంటసాల పూర్తిగా అర్హుడని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా నిర్వాహుకుల చేసే ప్రయత్నాన్ని అభినందిస్తూ తన పూర్తి మద్దతుని తెలిపారు. 


ప్రముఖ తెలుగు సినీ దర్శకులు వి. ఎన్. ఆదిత్య  మాట్లాడుతూ తాము ఘంటసాల సమాకాలీనులం కాకపోయినా వారి పాటల్ని విని పెరిగామని, వారి పాటల్లోని మాధుర్యం, దేశభక్తిని కొనియాడారు. ఘంటసాలకి భారతరత్న ఇస్తే ఆ అవార్డుకే గౌరవం పెరుగుతుందని ఘంటసాల మీద ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకులు రామాచారి కోమండూరి మాట్లాడుతూ చిన్ననాటి నుంచి ఘంటసాల పాటలు విని పెరిగామని, వారు లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరని అన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల ఆలపించిన కొన్ని భక్తి పాటలను పాడి శ్రోతలను అలరించారు. వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టెన్ రాజు మాట్లాడుతూ ఘంటసాల ఆణిముత్యాలాంటి పాటలు పాడి అందించడం తెలుగు వారు చేసుకున్న అదృష్టమని, వారి పాటలు వింటుంటే ఆ భగవంతుడే దిగివచ్చి పాడినట్టుగా ఉంటుందని కొనియాడారు.  


శంకర్ నేత్రాలయ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్. వి. ఆచార్య, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు డా. రాజ్ మోడీ, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు డా.మాధురి నముడూరి తదితరుల పాల్గొని ఘంటసాల పాటలపై తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు, ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని అభిప్రాయపడుతూ, ఘంటసాలకు కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్ధించారు. ఈ దిశగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ తెలిపారు. ఘంటసాలకు భారతరత్న కోసం తెలుగేతర రాష్ట్రాల వారి నుండి కూడా మద్దతు లభించడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.


ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని పలు తెలుగు సంస్థలతో 63 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధానకర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రామనికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ (Signature Campaign) కార్యక్రమము వసంత నవరాత్రులు సందర్భంగా మొదలుపెట్టామని నిర్వాహుకులు తెలిపారు, వివారాలు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు  https://chng.it/nQKtBRjS


Updated Date - 2022-04-12T23:18:40+05:30 IST