అన్న జగన్కు షర్మిల పరోక్షంగా చురకలు
ABN , First Publish Date - 2021-08-06T02:02:23+05:30 IST
అన్న జగన్కు షర్మిల పరోక్షంగా చురకలు
హైదరాబాద్: లోటస్ పాండ్లో వైఎస్సార్ టీపీ మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం, అన్న జగన్కు షర్మిల పరోక్షంగా చురకలు అంటించారు. తెలంగాణలో వైఎస్సార్ అభిమానులను గాలికి వదిలేశారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో ఉన్న వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైఎస్ కుటుంబం కోసం అభిమానులు, కార్యకర్తలు చాలా చేశారని, జేబులనుంచి డబ్బు ఖర్చు పెట్టుకున్నారని షర్మిల తెలిపారు. వారి శ్రమను ధార పోశారని, చాలా మంది అభిమానులకు గుర్తింపు దక్కలేదని ఆమె చెప్పారు. 12 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబంతోనే అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. గతాన్ని చూసి భవిష్యత్ మీద ఆశ కోల్పోవద్దని షర్మిల సూచించారు. ‘‘ఇప్పటివరకు ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క. మన కష్టం మనది మన పలితం మనది. మన పోరాటం మనది...మన గౌరవం మనది. మన కోసం మనం.. తెలంగాణ ప్రజల కోసం మనం. నేను నిలబడతా. వైఎస్సార్ అభిమానులను నిలబెడతా. రాజన్న ఆశయాలు మన పార్టితోనే సాధ్యం.’’ అని షర్మిల ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు.