పార్సిల్ ఎక్స్ప్రెస్ రైళ్ల సేవలు షురూ
ABN , First Publish Date - 2020-04-04T09:39:27+05:30 IST
కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణాకు ఎటువంటి అంతరాయం కలుగకూడదనే ధ్యేయంతో దేశంలోని పలు నగరాలకు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది.
సికింద్రాబాద్/హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణాకు ఎటువంటి అంతరాయం కలుగకూడదనే ధ్యేయంతో దేశంలోని పలు నగరాలకు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. గురువారం సికింద్రాబాద్ నుంచి హౌరాకు ప్రత్యేక పార్సిల్ ఎక్స్ప్రెస్ రైలు కాజీపేట, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి మీదుగా బయలుదేరింది. రైల్వే అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్ల 3005 ప్యాకేజీలతో 91.5 టన్నుల లోడ్తో ప్రత్యేక పార్సల్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. వీటిలో గుడ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలు, మందులు, వైద్య పరికరాలు, యంత్రాల విడిభాగాలు ఉన్నాయి., పుచ్చకాయలు, మామిడిపండ్లు, చేపల పెట్టెలు గుంతకల్లు, నంద్యాల, విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చాయి. అనకాపల్లి నుంచి నెయ్యి డబ్బాలు, విజయవాడ నుంచి నిమ్మకాయల బస్తాలు రవాణా అయిన సరుకుల్లో ఉన్నాయి. సరుకుల లోడింగ్కు ముందే పార్సిల్ వ్యాగన్లను శానిటైజర్లతో శుభ్రపరిచారు.