బ్యాంకు సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-08-03T05:30:00+05:30 IST
బ్యాంకు సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి
గిర్మాజిపేట, ఆగస్టు 3: వరంగల్ జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్డులో గల ఎస్బీఐ జోనల్ కార్యాలయ సెక్యూరిటీ గార్డు బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలకేంద్రానికి చెందిన మాజీ సైనికుడు తోట రమేష్ (48) ఎస్బీఐ జోనల్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి రమేష్ తన ఇంటి నుంచి వచ్చి రోజువారీ డ్యూటీలో చేరాడు. బుధవారం ఉదయం 7.30గంటల సమయంలో బ్యాంకు కార్యాలయ సెల్లార్ వద్ద రమేష్ మృతదేహం పడి ఉంది. పక్క భవనంపై ఉన్నవారు గమనించి బ్యాంక్ సిబ్బందికి తెలిపారు. బ్యాంక్ అధికారుల సమాచారంతో స్థానిక ఇంతేజార్గంజ్ సీఐ మల్లే్షయాదవ్, ఎస్సై గణేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం అనంతరం రమేష్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. క్లూస్ టీం వచ్చి మృతుడి సెల్ఫోన్, ఇతర ఆధారాలను సేకరించింది. పోలీసులు బ్యాంక్లోని సీపీ కెమెరాలను పరిశీలించగా ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని సీఐ మల్లే్షయాదవ్ తెలిపారు. కాగా, మృతుడు మూడంతస్థుల కార్యాలయ భవనంపై నుంచి పడి మృతిచెందినట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మూడు నెలల కిందటే రమేష్ పరకాల నుంచి బదిలీపై జోనల్ కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. కాగా, మృతుడికి భార్య శ్రీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు.