Secunderabad అల్లర్ల కేసు... ABN చేతిలో రిమాండ్ రిపోర్ట్
ABN , First Publish Date - 2022-06-21T01:29:36+05:30 IST
సికింద్రాబాద్ (Secunderabad) అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిమాండ్ రిపోర్టు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి చేతికి వచ్చింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిమాండ్ రిపోర్టు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి చేతికి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో మొత్తం 56 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు పేర్కొన్నారు. మొదటి నిందితుడితో పాటు A13 నుండి A56 వరకు అరెస్టయ్యారు. A2 నుండి A12 వరకు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు(A1)గా మధుసూదన్ని గుర్తించారు. అల్లర్లలో 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు చేర్చారు. 56 మంది నిందితులు ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారని, అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాట్సాప్ (WhatsApp) గ్రూప్ క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీమ్ పెట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్స్, చలో సికింద్రాబాద్ ARO3 గ్రూప్, ఆర్మీ GD2021 మార్చ్ ర్యాలీ గ్రూప్, CEE సోల్జర్ వాట్సాప్ గ్రూపులను అభ్యర్థులు క్రియేట్ చేశారని తెలిపారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్లో విధ్వంసం సృష్టించాలని ముందస్తు ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అభ్యర్థులకు పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్లాన్లో భాగంగా ఉదయం 8.30 నిమిషాలకు కలవాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
ఆత్మ రక్షణ కోసమే కాల్పులు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వచ్చిన అభ్యర్థులు.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పోలీసులు చెబుతున్నారు. రైలు ఇంజిన్, కోచ్లపై నిందితులు రాళ్లు విసిరారని, రాడ్లు, కర్రలతో రైళ్లపై ఆందోళనకారుల దాడులు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అల్లర్ల సమయంలో స్టేషన్లో 3 వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్తో ఉన్న 2 ఇంజిన్లు ఉన్నాయని, సమూహంలో కొందరు రెండు ఇంజిన్లకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని వివరించారు. పోలీసులు అడ్డుకునే క్రమంలో నిందితుల రాళ్ల దాడి చేశారని, ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిరసన కారులపై కాల్పులు జరిపారని పోలీసులు రిపోర్టులో ప్రస్తావించారు. ఈ కాల్పుల్లో బులెట్ తగిలి రాకేష్ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయని తెలిపారు. విధ్వంసం కారణంగా రైల్వే శాఖకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసులు వివరించారు.