ఎస్బీఐ ఏటీఎం దగ్ధం.. రూ.44 లక్షల ఆస్తినష్టం
ABN , First Publish Date - 2021-04-11T09:04:08+05:30 IST
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం శనివారం దగ్ధమైంది.
పామిడి, ఏప్రిల్ 10: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం శనివారం దగ్ధమైంది. ఏటీఎం గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని రెండు ఏటీఎం, రెండు బ్యాంకు పాసుపుస్తకాల ప్రింటింగ్ మిషన్లు, బ్యాటరీలతోపాటు పలు పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలను ఆర్పేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. మంటల వల్ల బ్యాటరీలు పేలి శబ్దం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. అగ్నిమాపక యంత్రం వచ్చి, మంటలను అదుపు చేసింది. ప్రమాదంలో ఏటీఎంలలోని రూ.32 లక్షల నగదు, ఇతర సామగ్రి కలిపి మొత్తం రూ.44.59 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని ఎస్బీఐ పామిడి బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీనరసింహ తెలిపారు.