కర్ఫ్యూ ఆంక్షలు తొలగించేందుకు రెడీ అవుతున్న సౌదీ.. మక్కాలో మాత్రం..
ABN , First Publish Date - 2020-05-26T18:00:10+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా 24 గంటలు కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా వచ్చే గురువారం నుంచి సడలింపులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి
ఒక్క మక్కాలో కొనసాగనున్న ఆంక్షలు
తదుపరి నోటీసులు వచ్చేవరకు ఉమ్రా తీర్థయాత్ర నిలిపివేత
ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రతిరోజు 2వేలకు పైగా పాజిటివ్ కేసులు
రియాధ్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా 24 గంటలు కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న సౌదీ అరేబియా వచ్చే గురువారం నుంచి సడలింపులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మూడు దశల్లో కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్లు సౌదీ సర్కార్ పేర్కొంది. కర్ఫ్యూ ఆంక్షల సడలింపులో భాగంగా రవాణా వ్యవస్థను పునరుద్ధరించనుంది. దేశీయ విమానాలు సైతం నడపనుంది. అలాగే మసీదుల్లో ప్రార్థనలకు కూడా అనుమతి ఇవ్వనుంది. ఒక్క మక్కాలో మాత్రం ఇప్పుడే ఎలాంటి సడలింపులు ఉండబోవని పేర్కొంది. అంతేగాక తదుపరి నోటీసులు వచ్చేవరకు ఉమ్రా తీర్థయాత్ర కూడా నిలిపివేయబడుతుందని తెలిపింది.
గురువారం ప్రారంభం కానున్న మొదటి దశలో 24 కర్ఫ్యూను మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటలకు కుదిస్తున్నట్లు సౌదీ అధికారులు తెలియజేశారు. మాల్స్, రిటైల్ మరియు హోల్సేల్ దుకాణాలకు మొదటి దశలో ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే శనివారం నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు ప్రజలు బయటకు వచ్చి తమ పనులు చేసుకొవచ్చు. ప్రభుత్వ, ప్ర్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించుకోవచ్చు. 50 మందికి మించి ఒక కార్యక్రమానికి హాజరు కాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత కూడా పాటించాలి.
ఇక మక్కాలో మొదటి దశలో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఇక్కడ జూన్ 20 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. జూన్ 21 నుంచి ప్రార్థనలకు అనుమతి ఉంటుంది. ఇదిలాఉంటే... ఇప్పటికీ సౌదీలో ప్రతిరోజు 2వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 74,795 మంది ఈ మహమ్మారి బారిన పడగా... 399 మంది మరణించారు.