సౌదీ సర్కార్ సంచలన నిర్ణయం !
ABN , First Publish Date - 2020-03-29T20:07:03+05:30 IST
సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది.
రియాధ్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. మార్చి 23వ తేదీ నుంచి ఈ కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. కరోనాను కట్టడి చేసేందుకు సౌదీ ప్రజా రవాణాను కూడా పూర్తి నిలిపివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది.
అయినా కరోనా కేసులు తగ్గకపోవడంతో ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలలో భాగంగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేయడం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో కార్యాలయ మూసీవేతలను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు సౌదీ సర్కార్ వెల్లడించింది.
అంతేగాక అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం దేశీయ విమానాలు, రైళ్లు, బస్సులు, టాక్సీ సర్వీసుల రద్దు కూడా నిరవధికంగా కొనసాగనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి దాని వ్యాప్తిని ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా అనేక చర్యలు తీసుకుంది. అందుకే ఇప్పటివరకు ఆ దేశంలో కేవలం నాలుగు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం సౌదీలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1,203గా ఉంది.