అంగరంగ వైభవంగా సప్త ఖండ అవధాన సాహితీ ఝరి విజయోత్సవ సభ

ABN , First Publish Date - 2022-05-31T18:57:50+05:30 IST

సప్త ఖండాలలోని వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సప్తఖండ అవధాన సాహితీ ఝరి విజయోత్సవ సభ, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, జీవన సాఫల్య సాహితీ పురస్కార సభ మే 29న శ్రీ ప్రణవ పీఠంలో అత్యద్భుతంగా జరిగాయి.

అంగరంగ వైభవంగా సప్త ఖండ అవధాన సాహితీ ఝరి విజయోత్సవ సభ

ఇంటర్నెట్ డెస్క్: సప్త ఖండాలలోని వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సప్తఖండ అవధాన సాహితీ ఝరి విజయోత్సవ సభ, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, జీవన సాఫల్య సాహితీ పురస్కార సభ మే 29న శ్రీ ప్రణవ పీఠంలో అత్యద్భుతంగా జరిగాయి. ప్రణవ పీఠం స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు అమెరికా, టెక్సాస్ నుండి శ్రీమతి కృష్ణ పద్మ తెలియజేశారు. సప్తఖండాల నుండి వివిధ దేశాల సాహిత్య నిపుణులు పాల్గొన్న సాహిత్య వేదిక అందరిని అలరించింది. 'ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము' అన్న నానుడితో సభ జయప్రదంగా ముగిసింది. 


ఈ అవధానంలో ఆస్ట్రేలియా ఖండం నుండి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ తరఫున గోవర్ధన్ మల్లెల, దక్షిణ ఆఫ్రికా ఖండం నుండి దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు సీతారామరాజు, ఐరోపా ఖండం నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(టాళ్) వైస్ చైర్మన్, కోశాధికారి రాజేష్ తోలేటి, ఆసియా ఖండం నుండి సింగపూర్ శ్రీ సాంస్మృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరి, ఖతార్ దేశం నుండి తెలుగుకళా సమితి అధ్యక్షులు తాతాజీ ఉసిరికల, సౌమ్య కంతేటి, మలేషియా నుండి తెలుగు అసోసియేషన్ తరఫున సత్యాదేవి మల్లుల పాల్గొన్నారు.


అలాగే ఉత్తర అమెరికా ఖండం, అమెరికా నుండి రామచంద్రరావు తల్లాప్రగడ, కెనడా నుండి  తెలుగుతల్లి కెనడా మాస పత్రిక ఎడిటర్ లక్ష్మీ రాయవరపు, దక్షిణ అమెరికా ఖండం, పెరూ దేశం నుండి రంగారెడ్డి బద్దం పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఖండం నుండి అవధాన శారదామూర్తి తటవర్తి కళ్యాణ చక్రవర్తి అవధాన సంచాలకత్వం చేశారు. తెలుగు భాషకి అత్యున్నత వైభవం అయిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే  సంకల్పంతో "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" అనే కొత్త ఆలోచనకి వద్దిపర్తి పద్మాకర్ శ్రీకారం చుట్టారు. మూడు భాషలలో సహస్రావధానం చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ప్రతి మాసం ఒక్కొక్క ఖండం చొప్పున దాదాపు 20కి పైగా దేశాలు పాల్గొనగా, అంతర్జాలంలో 13 అష్టావధానాలు పూర్తి చేశారు. మే 29వ తేదీన అంతర్జాలం వేదికగా సప్త ఖండాల నుండి తెలుగు ప్రతినిధులుగా 11 మంది పృచ్ఛకులు పాల్గొనగా 14వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేసారు. 


కళాబ్రహ్మ శిరోమణి డా. వంశీ రామరాజు, ప్రసిద్ధ తెలుగు సినీ గేయ రచయిత భువన చంద్ర, కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకులు మా శర్మ, ప్రముఖ కవి, సినీ గేయరచయిత వడ్డేపల్లి కృష్ణ విశిష్ట అతిథులుగా శ్రీ ప్రణవ పీఠానికి విచ్చేశారు. ప్రముఖ చలన చిత్ర నటులు తనికెళ్ళ భరణి, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టెన్ రాజు(అమెరికా), ఘంటసాల పార్వతి, పెరుంగో సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్, స్వామి నారాయణ (కెనెడా) తదితరులు జూమ్ ద్వారా సభలో పాల్గొన్నారు.


ఈ విజయోత్సవ సభలో సప్తఖండ అవధాన సాహితీ ఝరి ప్రత్యేక సంచిక ఆవిష్కరణతో పాటు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వంశీ ఆర్ట్ థియేటర్స్-ఇంటర్నేషనల్, ఇండియా; శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు శుభోదయం గ్రూపువారు సంయుక్తంగా నిర్వహిస్తున్న సద్గురు ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన సద్గురు ఘంటసాల శతజయంతి వంశీ - శుభోదయం అంతర్జాతీయ జీవిత సాఫల్య సాహితీ పురస్కారం- 2022 బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌కు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.


ఎంతో రసవత్తరంగా, కన్నుల పండుగగా సాగిన ఈ సభని వీక్షించిన సాహితీ ప్రియులు, చాలా కాలం తరువాత చక్కని కార్యక్రమం తిలకించామని హర్షం వ్యక్త చేశారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీ ప్రణవ పీఠం స్థాపించారు. ప్రవచన కర్తగా వారు సుప్రసిద్ధులు. సంగీత, సాహిత్యాలలో సమప్రతిభ, తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో సమ పాండిత్యం కలిగిన వారు. తెలుగు భాషని, సంస్కృతినీ నిలబెట్టడానికి వీరు ఆధ్యాత్మిక యాత్రలని శిష్యులతో చేస్తుంటారు.


ఏడు ఖండాల్లో జరిగిన ఈ 14 అవధానాలతో కలుపుకుని ఇప్పటికి 1,244 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు.. తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహాసహస్రావధానం చేశారు. వారి అసాధారణమైన ప్రతిభని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు గుర్తించాయి.  బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సంకల్పం నిరాటంకంగా సాగాలని, తెలుగుభాష మరింత ఖ్యాతిని గడించాలని ఆశిద్దాం. 









Updated Date - 2022-05-31T18:57:50+05:30 IST