సత్తా చాటాలి!

ABN , First Publish Date - 2021-03-02T06:40:24+05:30 IST

గతేడాది పేలవ ప్రదర్శన చేసిన భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌.. కొత్త సీజన్‌ను గ్రాండ్‌గా ఆరంభించాలనుకుంటున్నారు...

సత్తా చాటాలి!

  • నేటి నుంచి స్విస్‌ ఓపెన్‌
  • బరిలో సైనా, సింధు, శ్రీకాంత్‌
  • డబుల్స్‌ ఫేవరెట్‌గా సాత్విక్‌ జోడీ

బాసిల్‌ (స్విట్జర్లాండ్‌): గతేడాది పేలవ ప్రదర్శన చేసిన భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌.. కొత్త సీజన్‌ను గ్రాండ్‌గా ఆరంభించాలనుకుంటున్నారు. మంగళవారం నుంచి జరిగే స్విస్‌ ఓపెన్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ పీరియడ్‌ను పొడిగించడంతో వీరిద్దరికీ ఈ టోర్నీ కీలకం కానుంది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, పారుపల్లి కశ్యప్‌, లక్ష్య సేన్‌, సమీర్‌ వర్మతోపాటు గతేడాది రన్నరప్‌ సాయి ప్రణీత్‌ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడింగ్‌ దక్కించుకొన్న సింధు.. తొలి మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌ నెస్లిహాన్‌ ఇగిట్‌ (టర్కీ)తో తలపడనుంది. థాయ్‌లాండ్‌ ప్లేయర్‌ పిట్యాపోర్న్‌ చైవాన్‌తో సైనా ఆడనుంది. ఒకే పార్శ్వంలో ఉన్న సింధు, సైనా.. ఆరంభ రౌండ్లను అధిగమిస్తే సెమీస్‌లో ఒకరితో ఒకరు తలపడే అవకాశం ఉంది. కాగా, థాయ్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జోడీపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది.


కొత్త డబుల్స్‌ కోచ్‌ మాథియాస్‌ బో వద్ద నెల రోజులుగా సాధన చేస్తున్న సాత్విక్‌ జోడీ టోర్నీలో డబుల్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. మిక్స్‌డ్‌లో సాత్విక్‌-అశ్విని పొన్నప్ప జంటపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇక పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మరో భారత ఆటగాడు సమీర్‌ వర్మతో నాలుగో సీడ్‌ శ్రీకాంత్‌ తలపడనున్నాడు. డచ్‌ ఆటగాడు మార్క్‌ కలిజౌతో ప్రణయ్‌, పాబ్లో అబియన్‌ (స్పెయిన్‌)తో కశ్యప్‌, మిసా జిల్బర్‌మన్‌ (ఇజ్రాయెల్‌)తో ఒలింపిక్స్‌ ఆశావహుడు సాయి ప్రణీత్‌, థాయ్‌ ఆటగాడు థనోంగ్‌ సయిన్‌సోమ్‌బూమ్‌క్‌తో లక్ష్య సేన్‌ తొలిరౌండ్‌ ఆడనున్నారు. మిక్స్‌డ్‌లో ప్రణవ్‌ చోప్రా-సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్‌లో అర్జున్‌-కపిల జోడీలు బరిలోకి దిగనున్నాయి. 


Updated Date - 2021-03-02T06:40:24+05:30 IST