ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు

ABN , First Publish Date - 2020-05-23T08:25:03+05:30 IST

అది అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో. సమయం శుక్రవారం మధ్యాహ్నం 2.14 గంటలు. డిపోలోకి చొరబడిన వ్యక్తికి పూర్తి కండిషన్‌లో కొత్తగా..

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు

ధర్మవరం, మే 22: అది అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో. సమయం శుక్రవారం మధ్యాహ్నం 2.14 గంటలు. డిపోలోకి చొరబడిన వ్యక్తికి పూర్తి కండిషన్‌లో కొత్తగా ఉన్న ఆర్టీసీ బస్సు కనిపించింది. పైగా తాళం కూడా ఉండడంతో సెక్యూరిటీ కళ్లుగప్పి దాన్ని స్టార్ట్‌ చేసుకుని తీసుకెళ్లిపోయాడు. సంచలనం రేకెత్తించిన ఈ బస్సు దొంగతనం వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం డిపోకు చెందిన ఏపీ02జెడ్‌0552 నంబరు గల ఆర్టీసీ బస్సును వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కావడంతో డ్రైవర్‌ వెంకటేశ్‌ భోజనానికి బయటికి వెళ్లాడు. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగుడు గ్యారేజీలోకి చొరబడి బస్సును తీసుకెళ్లాడు. అదే సమయానికి భోజనం ముగించుకుని వస్తున్న డ్రైవర్‌ వెంకటేశ్‌ ఆ బస్సుని చూసి అనుమానంతో సెక్యూరిటీ పాయింట్‌ వద్దకెళ్లి ఆరాతీశారు.


వారు తమకేమీ తెలీదన్నారు. డిపో మేనేజర్‌ మల్లికార్జునకు ఫోన్‌ చేస్తే.. ఆయన కూడా తెలీదన్నారు. దీంతో బస్సు అపహరణకు గురైందని గుర్తించిన డ్రైవర్‌ వెంకటేశ్‌ 100కు ఫోన్‌ చేశారు. అనంతరం తోటి సిబ్బందితో కలిసి బస్సుని వెంబడించారు. చెన్నేకొత్తపల్లి పోలీసులు కూడా హైవేపై వెళ్తున్న బస్సుని వెంబడించారు. అమ్మవారిపల్లి సమీపంలో దాన్ని అడ్డుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని, బస్సుని ధర్మరవరం స్టేషన్‌కు తరలించారు. నిందితుడి పేరు ముజమిల్‌ఖాన్‌ అని, అతనిది కర్ణాటకలోని విజయపురి అని పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-05-23T08:25:03+05:30 IST