ఉల్లి కిలో 100

ABN , First Publish Date - 2020-10-22T09:53:49+05:30 IST

ఉల్లి ధర ఘాటెక్కిస్తోంది. రూ.40 నుంచి మొదలైన ఉల్లి ధర పెంపు రెండు నెలల వ్యవధిలోనే రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా,

ఉల్లి కిలో 100

రూ.170కి చేరే అవకాశం

వరదల్లో షోలాపూర్‌ పంట


(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

ఉల్లి ధర ఘాటెక్కిస్తోంది. రూ.40 నుంచి మొదలైన ఉల్లి ధర పెంపు రెండు నెలల వ్యవధిలోనే రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది. విజయవాడ నగరంలోని వినియోగదారులకు రోజుకు 70-80 టన్నుల ఉల్లిపాయలు అవసరమవుతాయి. ఒక్కో రైతుబజార్‌కు రోజుకు 10-12 టన్నుల ఉల్లిపాయలు అవసరం. అయితే, ప్రస్తుతం రోజుకు రెండు టన్నుల సరుకు రావడమే గగనంగా మారింది. బయటి మార్కెట్లకూ సరఫరా తగ్గిపోయింది. నవంబరు, డిసెంబరు నెలల్లో మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి ఉల్లి సరుకు వస్తుంది. సెప్టెంబరు నుంచి జనవరి వరకు కర్నూలు జిల్లాతోపాటు, కర్ణాటక నుంచి ఉల్లి వస్తుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైపోయింది.


చేతికి అందాల్సిన పంట కొట్టుకుపోయింది. లాక్‌డౌన్‌ సమయంలో గోడౌన్లలో బ్లాక్‌ అయి న ఉల్లిపాయలు ఇప్పుడు మా ర్కెట్లోకి వస్తున్నాయి. ఈ సరుకు మరో 2 వారాలు మాత్రమే సరిపోతుందని, ఆ తర్వాత పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. షోలాపూర్‌ నుంచి 200-300 లారీలు, కర్నూలు నుంచి 200 లారీలు, కర్ణాటక నుంచి 600 లారీల ఉల్లిపాయలు విజయవాడకు వస్తుంటా యి. అటువంటిది రోజుకు పది లారీల సరుకు రావట్లేదని చెబుతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో రూ.80-85 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ.100కు విక్రయిస్తుండటంతో  వినియోగదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గడచిన ఏడాది ఇదే సమయంలో కిలో ఉల్లి ధర రూ.170 ఉందని, రాబోయే రోజుల్లో దాన్నీ బ్రేక్‌ చేస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-22T09:53:49+05:30 IST