ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్
ABN , First Publish Date - 2021-01-14T08:31:02+05:30 IST
మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఏపీఎ్సఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు.
- మాజీ డీజీపీ చేతికి ప్రగతి రథ చక్రం
- అదనంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఏపీఎ్సఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీగా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత బాధ్యతల్లో అదనంగా కొనసాగాల్సిందిగా పేర్కొంది. బిహార్కు చెందిన ఆర్పీ ఠాకూర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాల్లో ఎస్పీగా, డీఐజీగా పనిచేసిన ఆయన డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. విభజిత రాష్ట్రంలో శాంతిభద్రతల ఏడీజీగా సమర్ధవంతమైన పనితీరు కనబరిచిన ఠాకూర్ను గత ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించడంతో సంచలనాలు సృష్టించారు.
దీంతో ఆయన్ను 2018 జూన్లో రాష్ట్ర డీజీపీగా ప్రభుత్వం నియమించింది. 2019 సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా అప్రాధాన్య పోస్టులోకి ఠాకూర్ను బదిలీ చేసింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న మాదిరెడ్డి ప్రతా్పను బదిలీ చేశాక రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు అదనపు బాధ్యతగా ఆర్టీసీని అప్పగించారు. ఇప్పుడు ఠాకూర్ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. అనంతరం తాడేపల్లిలో సీఎం జగన్తో భేటీ అయిన ఠాకూర్ తన నియామకంపై ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు ఆర్టీసీ ఎండీలుగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారులు (దినేశ్ రెడ్డి, ప్రసాదరావు, సాంబశివరావు, మాలకొండయ్య) డీజీపీలయ్యారు. అందుకు భిన్నంగా డీజీపీగా పనిచేసిన తర్వాత ఠాకూర్ ఆర్టీసీ ఎండీగా రావడం విశేషం.