Privateలో పేదలకు ఈ ఏడాది నుంచే 25శాతం సీట్లు
ABN , First Publish Date - 2022-08-05T18:35:11+05:30 IST
విద్యాహక్కు చట్టం(Right to Education Act) ప్రకారం ప్రైవేటు పాఠశాల(Private school)ల్లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించే విధానం
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టం(Right to Education Act) ప్రకారం ప్రైవేటు పాఠశాల(Private school)ల్లో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించే విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని పాఠశాల విద్యాశాఖ(Department of Education) స్పష్టంచేసింది. ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి)ను అనుసరించి అన్ని ప్రైవేటు పాఠశాలలు 25శాతం సీట్లను ఇందుకోసం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు కేటాయించి, అర్హులైన విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును ఫీజు రీయింబర్స్మెంట్(Reimbursement of Fees) కింద వర్తింపజేస్తామన్నారు. ఈ నెల 16 నుంచి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వస్తుందని ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. 30న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ప్రవేశాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను సెప్టెంబరు 2న విడుదల చేస్తామని, అదే రోజు నుంచి 9వ తేదీ వరకు అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు.