ఆ రైతులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-06T02:48:39+05:30 IST
ఆ రైతులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం: రేవంత్రెడ్డి
హైదరాబాద్: రైతులను నాశనం చేసి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చరిత్రలో లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో 450 మంది రైతులు అమరులయ్యారన్నారు. యూపీలో నలుగురు రైతులను కేంద్ర మంత్రి కొడుకు చంపారని ఆరోపించారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్షా ఉన్నారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో యోగి ప్రభుత్వం విఫలమైందన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాల పక్షాన దేశమంత నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పారు. చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని యూపీ సర్కార్ కర్కశంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. అజయ్ మిశ్రాను కేంద్రమంత్రి వర్గం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రా కొడుకుతో పాటు బీజేపీ నేతలపై హత్య కేసు నమోదు చేసి శిక్షించాలన్నారు.
శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మోదీ, అమిత్షా మరణ శాసనం చేస్తే.. అజయ్ మిశ్రా ఆయన కొడుకు అమలు చేశారని వ్యాఖ్యానించారు. యూపీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తితో ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. టీపీసీసీ పక్షాన చనిపోయిన రైతు కుటుంబాలకు లక్ష చొప్పున.. నాలుగు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని రేవంత్రెడ్డి తెలిపారు.