రెమిటెన్స్లు 9% తగ్గొచ్చు
ABN , First Publish Date - 2020-10-31T06:52:27+05:30 IST
ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నిధులు (రెమిటెన్స్) ఈ ఏడాది 9 శాతం తగ్గి 7,600 కోట్ల
ప్రపంచ బ్యాంక్ అంచనా
వాషింగ్టన్: ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నిధులు (రెమిటెన్స్) ఈ ఏడాది 9 శాతం తగ్గి 7,600 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5,62,400 కోట్లు) పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కరోనా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాద్యం రెమిటెన్స్ల రాకకు గండికొట్టనుందని తాజా నివేదికలో పేర్కొంది.
అయినప్పటికీ అత్యధికంగా రెమిటెన్స్లు అందుకునే దేశాల్లో ఈ ఏడాదీ భారత్దే అగ్రస్థానమని.. చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ టాప్-5లో కొనసాగనున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. మరిన్ని ముఖ్యాంశాలు..
ఇతర దేశాలకు వలసపోయిన కార్మికులు స్వదేశానికి పంపే నిధులు 2019 నాటి కరోనా పూర్వ స్థాయితో పోలిస్తే 2021 నాటికి 14 శాతం తగ్గవచ్చని అంచనా.
ఈ ఏడాది మధ్య, అల్పాదాయ దేశాలకు రెమిటెన్స్ల ప్రవాహం 7శాతం తగ్గి 50,800 కోట్ల డాలర్లకు పరిమితం కానుంది. 2021లో మరో 7.5 శాతం తగ్గి 47,000 కోట్ల డాలర్లకు పడిపోవచ్చు.
కార్మికులు ఎక్కువగా వలసపోయే దేశాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన బలహీనపడటంతో పాటు ముడి చమురు ధరల తగ్గుదల, అమెరికన్ డాలర్తో పోలిస్తే రెమిటెన్స్లు అందుకునే దేశాల కరెన్సీ మారకం రేటు బలహీనపడటం మొత్తంగా రెమిటెన్స్ల తగ్గుదలకు కారణం కానున్నాయి.
ఈ ఏడాదితో పాటు వచ్చే సంవత్సరంలో రెమిటెన్స్ల తగ్గుదల ప్రపంచంలోని అన్ని రీజియన్లను ప్రభావితం చేయనుంది.