ఆ విషయంలో జగన్, భారతి స్పందించలేదు: రెడ్డప్పశ్రీనివాసులరెడ్డి

ABN , First Publish Date - 2022-02-28T23:57:19+05:30 IST

సొంత బాబాయ్‌ని చంపినవారిని కాపాడటంకోసం సొంతచెల్లిని రోడ్లపాలు చేసిన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను రక్షిస్తాడా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పశ్రీనివాసులరెడ్డి అన్నారు.

ఆ విషయంలో జగన్, భారతి స్పందించలేదు: రెడ్డప్పశ్రీనివాసులరెడ్డి

అమరావతి: వివేకా కుమార్తె సునీత తన తండ్రిని చంపినవారికి శిక్షపడేలా చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, ఆయన భార్య భారతిని కన్నీటితో వేడుకున్నా వారి మనసు కరగలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పశ్రీనివాసులరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని సీబీఐకి సునీత చెప్పిన వివరాలతో తేలిపోయిందన్నారు.  సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానందరెడ్డిని చంపిన వారిని జగన్మోహన్ రెడ్డి కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పిందన్నారు.సొంత బాబాయ్‌ని చంపినవారిని కాపాడటంకోసం సొంతచెల్లిని  రోడ్లపాలు చేసిన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను రక్షిస్తాడా అని ప్రశ్నించారు.


సునీత, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి ప్రమేయముందని చెప్పినా, అవినాశ్‌రెడ్డిపై 11కేసులున్నాయి, తనపై 13 కేసులు ఉన్నాయంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటం జగన్మోహన్‌రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వానికి సంకేతమన్నారు.  అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు సునీత లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా నోరుతెరిచి మీడియా ముఖంగా వాస్తవాలు వెల్లడించాలని రెడ్డప్పశ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-28T23:57:19+05:30 IST