రవి రజత పట్టు

ABN , First Publish Date - 2021-08-06T09:29:28+05:30 IST

పురుషుల హాకీ జట్టుకి కాంస్యం దక్కిందనే ఆనందంలో ఉండగానే.. రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా తన రజత పతకంతో అబ్బురపరిచాడు. స్వర్ణంపై ఆశలు రేపినా...

రవి రజత పట్టు

  • ఫైనల్లో దహియా ఓటమి

పురుషుల హాకీ జట్టుకి కాంస్యం దక్కిందనే ఆనందంలో ఉండగానే.. రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా తన రజత పతకంతో అబ్బురపరిచాడు. స్వర్ణంపై ఆశలు రేపినా.. 57కేజీ ఫ్రీస్టయిల్‌ విభాగం ఫైనల్లో రష్యాకు చెందిన వరల్డ్‌ చాంపియన్‌ జవుర్‌ ఉగుయేవ్‌ చేతిలో 4-7తో పోరాడి ఓడాడు. స్వర్ణమే లక్ష్యంగా ‘పట్టు’పట్టినా ప్రత్యర్థి సత్తా ముందు నిలువలేకపోయాడు. దీంతో ఈ క్రీడలో భారత్‌కు రెండో రజతం అందించిన రెజ్లర్‌గా 23 ఏళ్ల రవి దహియా నిలిచాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌ తొలి రజతం గెలిచాడు. 2008 నుంచి వరుసగా రెజ్లింగ్‌లో భారత్‌ పతకం సాధిస్తుండడం విశేషం. ఓవరాల్‌గా కేడీ జాదవ్‌ (1952), సుశీల్‌ (2008, 12), యోగేశ్వర్‌ దత్‌ (2012), సాక్షి మాలిక్‌ (2016) తర్వాత నిలిచాడు. అలాగే 9 ఏళ్ల తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన భారత క్రీడాకారుడయ్యాడు. ఇక ఫైనల్‌ పోరులో రవికి ఎదురైంది మామూలు ప్రత్యర్థి కాదు. ఉగుయేవ్‌ వరుసగా రెండుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌. ఇది అతడికి తొలి ఒలింపిక్స్‌ అయినా గోల్డ్‌ మెడల్‌ ఫేవరెట్‌గానే బరిలోకి దిగాడు. ఆరంభంలోనే రెండుసార్లు రవిని మ్యాట్‌ నుంచి బయటికి పంపడంతో 0-2తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత రష్యన్‌ను సమాంతరంగా కింద అణిచిపెట్టి 2-2తో సమంగా నిలిచాడు. కానీ ఆ తర్వాత ప్రత్యర్థి పుంజుకుని 7-2తో దూసుకెళ్లడంతో ఓటమి ఖాయమైంది. చివర్లో రవి మరో రెండు పాయింట్లు సాధించినా లాభం లేకపోయింది. 

Updated Date - 2021-08-06T09:29:28+05:30 IST