6 ఏళ్లుగా సౌదీలోనే.. ఒక్కసారి కూడా ఇంటికి రాని వైనం! ఇంతలో అనూహ్యంగా కబళించిన మృత్యువు! కంటతడి పెట్టిస్తున్న కార్మికుడి గాధ..!
ABN , First Publish Date - 2022-04-10T00:11:48+05:30 IST
6 ఏళ్లుగా సౌదీలోనే.. ఒక్కసారి కూడా ఇంటికి రాని వైనం! ఇంతలో అనూహ్యంగా కబళించిన మృత్యువు! కంటతడి పెట్టిస్తున్న కార్మికుడి గాధ..!
ఎన్నారై డెస్క్: ఆరేళ్లుగా ప్రవాసంలోనే ఉంటున్నాడా వ్యక్తి. భారత్లోని కుటుంబంతో ఫోన్లో సంభాషించడం మినహా స్వదేశానికి ఒక్కసారి కూడా రాలేదు. రెక్కల కష్టంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత కాలం క్రితం మూడు లక్షల రూపాయలు కావాలంటూ ఇంట్లో వాళ్లని కోరాడు. అతడి కోరిక మేరకు ఆ మొత్తాన్ని వారు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తరువాత.. అతడి నుంచి ఫోన్లు రావడం ఆగిపోయింది. చివరికి ఓరోజు అతడు చనిపోయినట్టు కబురు రావడంతో కుటుంబసభ్యులు విచారంలో మునిగిపోయారు. రాజస్థాన్లోని శీకర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
దాయిరా గ్రామానికి చెందిన కైలాస్ శైనీ(35) సుమారు ఆరేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ కార్మికుడిగా పని చేసుకుంటూ రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యం అతడు తన కుటుంబంతో ఫోన్లో సంభాషించేవాడే కానీ.. ఈ ఆరేళ్లలో ఒక్కసారి కూడా భారత్కు రాలేదు. కొంత కాలం క్రితం మూడు లక్షల రూపాయలు కావాలంటూ తన కుటుంబ సభ్యులను కోరాడు. అతడు కోరినట్టే వారు ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తరువాత.. అనూహ్యంగా అతడు ఇంటికి ఫోన్ చేయడం మానేశాడు. దీంతో.. అతడి కుటుంబసభ్యులు భయాందోళనలకు లోనయ్యారు. తమ పరిచయస్తుల ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
ఇంతలో ఓ రోజు కైలాస్ మరణించాడంటూ అతడి స్నేహితుడు కైలాస్ సోదరుడికి సమాచారం అందించాడు. దీంతో.. యావత్ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక.. అతడి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ఆ కుటుంబం చాలా ప్రయాసపడింది. చివరికి అతడు మరణించిన 45 రోజుల తరువాత కైలాస్ మృతదేహం ఇటీవలే స్వగ్రామానికి చేరుకుంది. ఆరేళ్ల క్రితం తాము చివరిసారిగా చూసిన వ్యక్తి.. ఇలా నిర్జీవంగా కళ్లముందు కనిపించడంతో ఆ కుటుంబం బోరున విలపించింది. కైలాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.