‘ముఖ్యమంత్రి’కి షాక్ ఇచ్చిన టీచర్లు..!
ABN , First Publish Date - 2021-11-17T13:21:46+05:30 IST
టీచర్లు షాక్ ఇచ్చారు..
అవును సార్.. బదిలీలకు డబ్బులిస్తున్నాం!
రాజస్థాన్ సీఎం ప్రశ్నకు టీచర్ల సూటి జవాబు.. చర్యలు తీసుకుంటానన్న గెహ్లోత్
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు టీచర్లు షాక్ ఇచ్చారు. జైపూర్లో ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బదిలీల కోసం నగదు డబ్బులివ్వాల్సి వస్తోందా..? నిజమేనా..? అని ప్రశ్నించారు. అయితే ఆయన ఊహించని రీతిలో వారందరి నుంచీ మూకుమ్మడిగా అవుననే సమాధానం వచ్చింది. ‘‘అవును సార్.. డబ్బులు ఇవ్వకుండా, స్థానిక ఎమ్మెల్యేలను మంచి చేసుకోకుండా బదిలీలు, కొత్త పోస్టింగులు సాధ్యం కావడం లేదు’’ అని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. వారి స్పందనతో గతుక్కుమన్న సీఎం, సమస్యను వెంటనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఒక విధానాన్ని వెంటనే అమలులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాగా.. అదే వేదికపై విద్యాశాఖ మంత్రి గోవింద్ డోటాసరా కూడా ఉండటం గమనార్హం.