
వాషింగ్టన్: ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) ఇల్లినాయిస్ నుండి డెమొక్రాటిక్ ప్రైమరీ (Democratic Primary)లో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి జునైద్ అహ్మద్ను (Junaid Ahmed) 71 శాతం ఓట్లతో ఓడించారు. ఇల్లినాయిస్లోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్లో బాగా ఆదరణ ఉన్న కృష్ణమూర్తి జునైద్ అహ్మద్ నిర్వహించిన మతపరమైన ప్రచారాన్ని కూడా అధిగమించి భారీ మెజారిటీ సాధించడం విశేషం. "ఇల్లినాయిస్లోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్లోని డెమొక్రాటిక్ ప్రైమరీ ఓటర్లు కాంగ్రెస్కు మళ్లీ నా ఎన్నికల ప్రచారానికి మద్దతుగా అఖండమైన, నిర్ణయాత్మక పద్ధతిలో ఓటు వేసినందుకు ధన్యవాదాలు. ఇది నాకు దక్కిన గౌరవం. కాంగ్రెస్లో మధ్యతరగతి కోసం, మహిళల పునరుత్పత్తి హక్కుల కోసం, ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాబోయే నెలల్లో కీలక పోరు ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తాను" అని కృష్ణమూర్తి అన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా వచ్చే నవంబర్ 8న జరిగే జనరల్ ఎన్నికలపై ఉందన్నారు. ఈ ఎన్నికల్లో రాజా కృష్ణమూర్తి రిపబ్లికన్ అభ్యర్థి అయిన క్రిస్ డార్గిస్ను ఢీకొనబోతున్నారు.
ఇవి కూడా చదవండి