వేటు వేయండి!

ABN , First Publish Date - 2020-07-04T09:39:35+05:30 IST

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ...

వేటు వేయండి!

రఘురామకృష్ణంరాజును అనర్హుడిగా ప్రకటించండి..

లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు

న్యూఢిల్లీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని.. లోక్‌సభ సభ్యత్వానికి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌, ఎంపీలు నందిగం సురేశ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలతో కూడిన బృందం స్పీకర్‌ను కలిసి..ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. అనంతరం విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి లోబడి  సభాపతికి ఫిర్యాదు సమర్పించామని తెలిపారు.  ప్రజాస్వామ్యాన్ని కూలదోసే విధంగా.. పార్టీ నియమావళి, క్రమశిక్షణను అతిక్రమించి.. బహిరంగ చర్చల్లో పార్టీని విమర్శించడం, దూషించడం ఎంతవరకు సమంజసమని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.  ‘మా పార్టీ సింబల్‌, మేనిఫెస్టోపై ఆయన ఎన్నికైనప్పటికీ, గెలుపొందాక ఆ నియమాలను గాలికొదిలేశారు. పార్టీపైన, పార్టీ అధ్యక్షుడిపైన అన్‌పార్లమెంటరీ భాష వాడారు. స్వపక్షంలో విపక్షంలా ఆయన వ్యవహరించిన తీరు క్ష మించరానిది. వైసీపీలో ఉంటూ ప్రతిపక్షాలవారితో మంతనాలు జరుపుతూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరడం అనివార్యమైంది.  నైతిక విలువలు కోల్పోయి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీలో ఉన్నవారందరినీ దూషిస్తూ, మిగతా ప్రతిపక్షాలతో లాలూచీపడడం దిగజారుడుతనానికి నిదర్శనం కాదా? రఘురామరాజు భౌతికంగా మా పార్టీలో ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా లేరన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నాం. ఎంపీని చేసిన తల్లిలాంటి పార్టీని ప్రజల్లో చులకన చేసే ప్రయత్నం చేశారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే, వాటిపై స్పష్టత కోసం పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి. అంతేతప్ప బహిరంగ వేదికలపై చర్చించకూడదు. ఆయనపై ఉన్న కేసులు, బలహీనతలు, ఇతరత్రా లాభాపేక్షతో కొన్ని విపక్షాలతో కుమ్మక్కై మాతృ పార్టీకి ముప్పు తలపెట్టడం ఎంతవరకు సబబు? ఆయన ప్రవర్తన పార్టీ నియమావళిని, క్రమశిక్ష ణను ఉల్లంఘించడమే’ అని స్పష్టం చేశారు.


పార్టీ ప్రజాప్రతినిధులకు కొంతవరకే స్వేచ్ఛ

కన్నతల్లిలాంటి పార్టీకి, అధినాయకుడికి ఎవరైనా విధేయుడిగా ఉండాల్సిందేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీపరంగా ప్రతి ఎమ్మెల్యే, ఎంపీకి, సభ్యులకు కొంతవరకే స్వేచ్ఛ ఉంటుందని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలి‘ అని పార్టీ అధినేతను ఉద్దేశించి విమర్శించడం రఘురామరాజు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయనపై అనర్హత వేటు తప్పదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

Updated Date - 2020-07-04T09:39:35+05:30 IST