ఏమన్నా అంటే 151 సీట్లు అంటారు.. రఘురామ సెటైర్లు

ABN , First Publish Date - 2020-09-18T18:45:04+05:30 IST

న్యాయవ్యవస్థను తప్పుబట్టడం సరికాదని.. పార్లమెంట్‌ లోపల, బయట జరుగుతున్న దాడిని ఖండిస్తున్నట్టు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు.

ఏమన్నా అంటే 151 సీట్లు అంటారు.. రఘురామ సెటైర్లు

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థను తప్పుబట్టడం సరికాదని.. పార్లమెంట్‌ లోపల, బయట జరుగుతున్న దాడిని ఖండిస్తున్నట్టు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు చేస్తున్న వైసీపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఏదైనా తప్పు జరిగితే ఇలా చిల్లర అల్లరి తగదన్నారు. న్యాయవ్యవస్థపై దాడి.. ఇంతకుమించిన అన్యాయం మరొకటి ఉండదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు తప్పుబడుతున్నాయని తమ పార్టీ ఎంపీలు అంటున్నారని.. కానీ ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండటం వల్లే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. పార్టీ జెండాలో మూడు రంగులు ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలకు వేసేస్తే కోర్టు ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. హైకోర్టులో కొట్టేశారు.. సుప్రీంలోనూ అదే జరిగిందని గుర్తు చేశారు. ‘‘రాజ్యాంగంపై గౌరవం లేదు. ఏమన్నా అంటే 151 సీట్లు అంటారు. ఆర్టికల్ 351కి వ్యతిరేకంగా వెళితే.. కుదరదు. ఇంగ్లీష్ మీడియం, మైనింగ్‌పై రాజ్యాంగం బద్ధంగా చెల్లదని హైకోర్టు చెప్పింది. సుప్రీంలోనూ అదే జరిగింది. రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్‌లో మూడో వంతు బలం ఉండాలి. అసెంబ్లీలో ఉంటే సరిపోదు. అప్పుడు మీకు నచ్చినట్టు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. చట్టం తెలిసిన వాళ్లు ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. న్యాయవ్యవస్థపై ఈ పుస్తకాలేంటో.. నాకు అర్థం కావడం లేదు. న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇవ్వాలి. మన తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టును ఎందుకంటారు. ప్రత్యేక హోదా ఉండదు, రైల్వే జోన్, దేవాలయాలపై మాట్లాడరు. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని.. మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం తప్పు.  .. మనమూ ఓ రోజు గత ప్రభుత్వం అవుతాం. పునఃసమీక్ష తగదని పంజాబ్, హర్యానా గొడవల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది’’ అని తెలిపారు. 

Updated Date - 2020-09-18T18:45:04+05:30 IST