నా రక్తం తాగిన పార్టీ.. రక్తం తిరిగి ఇస్తుందా?: రఘురామ

ABN , First Publish Date - 2020-09-23T19:45:51+05:30 IST

కేంద్రమంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ సమావేశం ఆయన వ్యక్తిగతమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

నా రక్తం తాగిన పార్టీ.. రక్తం తిరిగి ఇస్తుందా?: రఘురామ

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ సమావేశం ఆయన వ్యక్తిగతమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ హోంమంత్రితో ముఖ్యమంత్రి నిధుల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగన్‌.. తెలుగును భూస్థాపితం చేసి ఇంగ్లీష్‌ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తాను రాష్ట్రమంతా తిరుగుతానని.. ఎవరేం చేస్తారో చూస్తాన్నారు. వైసీపీ శ్రేణులు తనను పిచ్చికుక్క అని మాట్లాడుతున్నారని, తోలు తీస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. తన బాగోతాలను బయటపెడితే వారి బాగోతాలే బయటపడుతాయన్నారు. తాను ఎవరి బొమ్మతో గెలవలేదని.. తన బొమ్మతోనే గెలిచాని, తన రక్తం తాగిన పార్టీ.. రక్తం తిరిగి ఇస్తుందా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.


వైసీపీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సెక్యూరిటీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారు అలాగే మాట్లాడితే.. తన భద్రత రెట్టింపు అవుతుందన్నారు. హిందువులు అంటే జగన్‌కు గౌరవం ఉంటే..తిరుమలలో సంతకం పెట్టాకే దర్శనానికి వెళ్లాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ముఖ్యమంత్రికి స్వరూపానంద హితోపదేశం చేయాలన్నారు. హిందువు రక్షకుడిగా ఉంటాడనుకున్న సీఎం.. కక్షకుడిగా మారారని రఘురామ ఎద్దేవా చేశారు.


అమిత్‌ షాతో సీఎం జగన్‌ 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. న్యాయస్థానాలను, ఆలయాలను ఒకేలా చూడాలని, దేవుడికి గౌరవం ఇచ్చినట్లే.. జడ్జిలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలని ఎవరైనా చెబుతారని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-23T19:45:51+05:30 IST