జగనన్న గృహపథకం వైసీపీ పార్టీని గందరగోళంలోకి నెట్టింది: రఘురామ
ABN , First Publish Date - 2021-12-10T20:15:28+05:30 IST
జగనన్న గృహపథకం వైసీపీ పార్టీని గందరగోళంలోకి నెట్టిందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
న్యూఢిల్లీ: జగనన్న గృహపథకం వైసీపీ పార్టీని గందరగోళంలోకి నెట్టిందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లపై ప్రజా తిరుగుబాటు జరుగుతోందన్నారు. పథకాల కింద ఇచ్చిన ఇళ్లకు రూ.10 వేలు కట్టాలని.. దిగజారి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని.. అప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాలన తుగ్లక్ను తలపించే విధంగా ఉందని రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎన్ని పిచ్చి పనులు చేసినా రైతుల పాదయాత్ర ఆగదన్నారు. రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ కన్నా దారుణంగా మద్యం దోపిడీ జరుగుతోందన్నారు. ఇకనైనా మద్యం దుకాణాల దగ్గర దోపిడీ ఆపాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుమతిస్తే మహాపాదయాత్రలో పాల్గొనాలని ఉందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.