క్వారీ యాజమాన్యానికి రూ.33 కోట్ల జరిమానా

ABN , First Publish Date - 2020-07-11T08:31:41+05:30 IST

పర్మిట్లకు మించి రాయి తవ్వకాలు నిర్వహించిన క్వారీ యాజమాన్యానికి గనుల శాఖ విజిలెన్స్‌

క్వారీ యాజమాన్యానికి రూ.33 కోట్ల జరిమానా

విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పర్మిట్లకు మించి రాయి తవ్వకాలు నిర్వహించిన క్వారీ యాజమాన్యానికి గనుల శాఖ విజిలెన్స్‌ స్క్వాడ్‌ రూ.33,02,61,364 జరిమానా విధించింది.  విజిలెన్స్‌ సహాయ సంచాలకులు ఆర్‌.ప్రతా్‌పరెడ్డి తెలిపిన వివరాలు... విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సీతానగరం గ్రామంలో సర్వే నంబరు 251లో 7.05, 7.50 హెక్టార్లలలో వెంగమాంబ స్టోన్‌ క్రషర్‌ అండ్‌ క్వారీ పేరుతో వేర్వేరుగా పర్మిట్లు తీసుకున్నారు. 7.05 హెక్టార్లకు 2006 జూలై 18న తీసుకున్న పర్మిట్‌ వచ్చే ఏడాది జూలై 17 వరకు, 7.50 హెక్టార్లకు 2008 నవంబరు 7న తీసుకున్న పర్మిట్‌కు 2023 అక్టోబరు 7వ తేదీ వరకు అనుమతి ఉంది. 7.05 హెక్టార్లలో 70,030 క్యూబిక్‌ మీటర్లకు పర్మిట్‌ తీసుకోగా 3,41,708 క్యూబిక్‌మీటర్ల రాయి అంటే..పర్మిట్‌ కంటే 2,71,678 క్యూబిక్‌ మీటర్లు అధికంగా తవ్వినట్టు అధికారులు గుర్తించారు. దీనికి రూ.15,45,30,446లు జరిమానా విధించారు.


మరో పర్మిట్‌లో 7.50 హెక్టార్లల్లో 4,76,868 క్యూబిక్‌ మీటర్లకు అనుమతి తీసుకోగా 7,74,113 క్యూబిక్‌ మీటర్లు అంటే..పర్మిట్‌ కంటే 2,97,245 క్యూబిక్‌ మీటర్లు ఎక్కువగా తవ్వకాలు చేపట్టడంతో రూ. 16,90,73,114లు జరిమానా విధించారు. ఇదే గ్రామంలో సర్వే నంబరు 193లో 0.838 హెక్టార్లల్లో 3503 క్యూబిక్‌ మీటర్లు, సర్వే నంబరు 303లో 2.08 హెక్టార్లలో 8,202 క్యూబిక్‌ మీటర్ల రాయి తవ్వకాలకు పర్మిట్‌ తీసుకున్నా.... ఇంత వరకు ఎటువంటి తవ్వకాలు చేపట్టలేదు. దీంతో పర్మిట్లను దుర్వినియోగంచేసినట్టు అధికారులు గుర్తించారు. సర్వే నంబరు 193లో పర్మిట్‌కు సంబంధించి రూ.19,92,506, సర్వే నంబరు 303కు సంబంధించి రూ.46,65,298 జరిమానా విధించారు.

Updated Date - 2020-07-11T08:31:41+05:30 IST