నెం.1కు సింధు షాక్
ABN , First Publish Date - 2022-05-21T09:31:26+05:30 IST
పీవీ సింధు థాయ్లాండ్ ఓపెన్లో జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు దూసుకుపోయింది.
సెమీస్లో భారత స్టార్
థాయ్లాండ్ ఓపెన్
బ్యాంకాక్: పీవీ సింధు థాయ్లాండ్ ఓపెన్లో జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు దూసుకుపోయింది. శుక్రవారం మూడు గేమ్లపాటు జరిగిన క్వార్టర్ఫైనల్లో సింధు (వరల్డ్ నెం.7) 21-15, 20-22, 21-13తో ప్రపంచ నెంబర్ వన్ అకానె యమగూచి (జపాన్)ని చిత్తు చేసింది. క్వార్టర్ఫైనల్ తొలి గేమ్లో ఇద్దరు షట్లర్లు నువ్వా..నేనా అనేలా తలపడ్డారు. కానీ క్రాస్కోర్టు, డ్రాప్షాట్లతో ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెట్టిన సింధుమూడు పాయింట్ల ఆధిక్యం సాధించి 11-9తో విరామానికి వెళ్లింది. అనంతరం యమగూచి, సింధు వరుస పాయింట్లు దక్కించుకొని జోరు ప్రదర్శించినా..చివరకు భారత షట్లరే గేమ్ను కైవసం చేసుకుంది.
రెండో గేమ్ ఆరంభంలో యమగూచి పొరపాట్లు చేయడంతో సింధు ఆధిక్యంలోకి వెళ్లినా..తర్వాత తేరుకొన్న జపాన్ షట్లర్ ఏకంగా గేమ్ నెగ్గింది. నిర్ణాయక మూడో గేమ్లో వెన్నునొప్పితో యమగూచి ఆట గాడితప్పగా..ఇదే అదనుగా స్మాష్లతో విరుచుకుపడిన సింధు గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకుంది. సెమీస్లో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యూ ఫీ (చైనా)ని సింధు ఢీకొంటుంది.