హాకీ జట్టు ఆటగాళ్లకు పంజాబ్ భారీ నజరానా!
ABN , First Publish Date - 2021-08-05T18:24:49+05:30 IST
ఒలింపిక్స్లో జర్మనీ ఓడించి కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.
చండీగఢ్: ఒలింపిక్స్లో జర్మనీని ఓడించి కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్కు మరో పతకాన్ని అందించింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు భారత జట్టును అభినందించారు. ఇదిలాఉంటే.. తాజాగా పంజాబ్ ప్రభుత్వం హాకీ జట్టు ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ఆ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లకు చెరో కోటి రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత హాకీ జట్టులో 8 మంది పంజాబీలు ఉన్నారు. జట్టు సారథి మన్ప్రీత్ సింగ్, మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, రూపిందర్పాల్ సింగ్, శంషీర్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, గుర్జీత్ సింగ్ పంజాబ్కు చెందినవారే. స్వర్ణం గెలిస్తే ఒక్కొ ఆటగాడికి రూ.2.25 కోట్లు ఇస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. కానీ, ఇప్పుడు కాంస్యం గెలవడంతో కోటి రూపాయలు ఇవ్వనుంది. అటు భారత ప్రభుత్వం నుంచి కూడా హాకీ జట్టుకు ప్రోత్సహకాలు అందుతాయనే విషయం తెలిసిందే.