ఎలాన్ మస్క్ కోసం పోటీపడుతున్న పంజాబ్, మహారాష్ట్ర, బెంగాల్, తెలంగాణ!
ABN , First Publish Date - 2022-01-17T02:13:47+05:30 IST
అమెరికా బిలియనీర్, టెస్లా మోటార్స్ సీఈవో ఎలామన్ మస్క్ కోసం పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్
న్యూఢిల్లీ: అమెరికా బిలియనీర్, టెస్లా మోటార్స్ సీఈవో ఎలామన్ మస్క్ కోసం పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. మా రాష్ట్రానికి రావాలంటే మా రాష్ట్రానికి రావాలంటూ ఆహ్వానిస్తున్నాయి. ఈ ఆహ్వానాల వెనక ఓ పెద్ద కథే ఉంది. ఇండియాలో ఎల్ట్రక్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఇటీవల ఓ ట్విట్టర్ యూజర్ మస్క్ను కోరాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. తనకూ రావాలనే ఉందని కానీ, భారత ప్రభుత్వం నుంచి చాలా కఠన సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నాడు.
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నామని, కాబట్టి దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గతేడాది టెస్లా మోటార్స్ ప్రభుత్వాన్ని కోరింది. స్పందించిన భారత భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ.. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తాం కానీ, అంతకంటే ముందు భారత్లో తయారీ పరిశ్రమ నెలకొల్పాని కోరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి టెస్లాకు అడ్డంకులు ఎదురవడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగిపోయాయి. తమ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమ నెలకొల్పాలంటూ పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మస్క్ను ఆహ్వానిస్తున్నాయి.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆదివారం ఓ ట్వీట్ చేస్తూ మాస్క్ను పంజాబ్ ఆహ్వానించారు. కార్ల కంపెనీకి లుధియానా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. పంజాబ్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యంతో గ్రీన్ జాబ్స్ సృష్టించేందుకు సమయానుకూల సింగిల్ విండో క్లియరెన్స్తో లుథియానాను ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మారుస్తామని అన్నారు.
పశ్చిమ బెంగాల్ మైనారిటీ అభివృద్ధి, మదర్సా ఎడ్యుకేషన్ మంత్రి మహ్మద్ గులామ్ రబ్బానీ ట్వీట్ చేస్తూ.. బెంగాల్ అంటే బిజినెస్సేనని, ఇక్కడికొచ్చి కంపెనీ పెట్టాలని మస్క్ను కోరారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని, తమ నాయకురాలు మమతా బెనర్జీ ముందుచూపున్న నాయకురాలని పేర్కొన్నారు. అయితే, ఆయన ట్వీట్ను బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికల అనంతర హింస, సింగూరు ఆందోళనను గుర్తు చేసింది.
మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిట్ కూడా ఎలాన్ మస్క్ను తమ రాష్ట్రానికి ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో కంపెనీ ప్రారంభిస్తే అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ మంత్రి కేటీ రామారావు కూడా అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ను ఆహ్వానించారు. శుక్రవారం ఓ ట్వీట్ చేస్తూ.. తాను తెలంగాణ ఇండస్ట్రీ, కామర్స్ మంత్రినని, టెస్లా తమ రాష్ట్రంలో భాగస్వామి అయితే చాలా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విధానం ఉందని పేర్కొన్నారు. 200 ఎకరాల్లో ఈవీ పార్క్ సెజ్ ఉందని, ఇటీవల అమెరికా ఈవీ మేజర్ ‘ట్రిటాన్’ రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించిందని కేటీఆర్ పేర్కొన్నారు.