‘సైకో’ కిల్లర్ చిక్కాడు
ABN , First Publish Date - 2020-06-07T09:36:57+05:30 IST
మూడు రాష్ర్టాల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారానికి యత్నించి, ప్రతిఘటించడంతో వారిని హత్యచేసి, నాలుగేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సైకో కిల్లర్ ఎట్టకేలకు సిక్కోలు పోలీసులకు చిక్కాడు.
శ్రీకాకుళం, జూన్ 6(ఆంధ్రజ్యోతి): మూడు రాష్ర్టాల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారానికి యత్నించి, ప్రతిఘటించడంతో వారిని హత్యచేసి, నాలుగేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సైకో కిల్లర్ ఎట్టకేలకు సిక్కోలు పోలీసులకు చిక్కాడు. ఎస్పీ అమ్మిరెడ్డి శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిసాలోని గజపతి జిల్లా గండాహతి పంచాయతీ పలకభద్ర గ్రామానికి చెందిన సవర రమేశ్(55) భీంపురం గ్రామానికి చెందిన సంపను పెళ్లి చేసుకుని అత్తవారింటికి ఇల్లరికం వెళ్లిపోయాడు. 2016 అక్టోబరు 16న భీంపురంలో దేసేటి దమయంతిపై అత్యాచారానికి రమేశ్ యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపి తెలంగాణకు పరారయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని శ్రీలక్ష్మీతులసి ఆగ్రోపేపర్ మిల్లులో కూలీగా చేరి అక్కడే పనిచేస్తున్న ముచ్చిక కోసమ్మపై 2017 నవంబరు 18న అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హతమార్చి పరారయ్యాడు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా గోకినకొండలో చేపలచెరువు వద్ద పనికి చేరాడు. అక్కడే పనిచేస్తున్న బొమ్మలి లక్ష్మి కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె చెల్లెలు వితంతువైన జయంతికి ఇంటి నిర్మాణానికి రమేశ్ రూ.30వేలు అప్పు ఇచ్చాడు. తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయిన జయంతిని 2019 డిసెంబరు 16న మాయమాటలు చెప్పి మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి రప్పించి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపేసి ఆష్షోర్ కాలువలో పడేసి పరారయ్యాడు. తాజాగా తమిళనాడుకు పారిపోతుండగా సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా సారవకోట ఎస్ఐ అతన్ని పట్టుకున్నారు.