పదోన్నతులు, హేతుబద్ధీకరణ, బదిలీలు
ABN , First Publish Date - 2022-03-11T07:38:36+05:30 IST
ఉపాధ్యాయుల పదోన్నతులతోపాటు హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్),బదిలీలను ఒకేసారి నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు.
- ఈ మూడు ప్రక్రియలూ ఒకేసారి !
- టీచర్ల పదోన్నతులపై విద్యాశాఖ కసరత్తు
- మరో 10వేల పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం
- డీఎస్సీ ద్వారానే భర్తీ ప్రక్రియ ?
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పదోన్నతులతోపాటు హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్),బదిలీలను ఒకేసారి నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. టీచర్ల పదోన్నతులపై సర్కారు నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో.. కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ పదోన్నతులను మాత్రమే చేపడితే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని గుర్తించినట్లు తెలుస్తోంది. వాటిని అధిగమించడానికి వీలుగా పదోన్నతులతో పాటు రేషనలైజేషన్, బదిలీలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారు.
ఆ జాబితా ప్రకారమే పదోన్నతులు..
కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపునకు తయారుచేసిన టీచర్ల సీనియారిటీ జాబితాను అనుసరించి పదోన్నతులు ఇవ్వనున్నారు. ప్రత్యేక షెడ్యూల్ను ప్రకటించి నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది. పదోతరగతి పరీక్షల అనంతరం వేసవి సెలవులను ప్రకటించనున్నారు. ఈ పదోన్నతులతో పాటే హేతుబద్ధీకరణ, బదిలీలను కూడా ఏకకాలంలో చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో విద్యార్థులు ఎక్కువగా, మరికొన్ని స్కూళ్లల్లో తక్కువగా ఉన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అదే నిష్పత్తిలో ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రక్రియను సవ్యంగా నిర్వహించాలంటే... హేతుబద్ధీకరణను చేయాల్సి ఉంటుంది. పదోన్నతులను కల్పిస్తే కొత్త పోస్టింగ్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇవి ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. దీంతో ఈ మూడింటిని ఒకేసారి నిర్వహిస్తే టీచర్లకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 13,086 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారానే భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ భర్తీ ప్రక్రియ ఎలా ఉండొచ్చన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో తక్కువ పోస్టులే ఉన్నందున వాటిని డీఎస్సీల ద్వారా భర్తీ చేయడం సులువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై అస్పష్టత
రాష్ట్రంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని ఏ పద్ధతిలో చేపట్టాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై గతంలోనే ఉన్నత విద్యామండలి అధికారులు మూడు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. టీఎ్సపీఎస్సీ, ప్రత్యేక బోర్డు, యూనివర్సిటీలు ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఈ అంశాలపై తుది నిర్ణయాన్ని తీసుకోకపోవడం గమనార్హం.