కరోనాకు ప్రైవేటు వైద్యం
ABN , First Publish Date - 2020-07-09T08:28:45+05:30 IST
రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కొవిడ్ చికిత్సలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చికిత్సకు అయ్యే వ్యయాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ
- 3 కేటగిరీలుగా ఆస్పత్రులకు అనుమతి
- ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితం
- నగదు చెల్లింపుతోనూ చికిత్సకు ఓకే
- రేట్లు నిర్ధారించిన ఆరోగ్యశ్రీ అధికారులు
- సాధారణ లక్షణాలకు రోజుకు రూ.3,250
- ఐసీయూలో రూ.5-10 వేల వరకూ చార్జి
- మార్గదర్శకాలు విడుదల చేసిన ఆరోగ్యశాఖ
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కొవిడ్ చికిత్సలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చికిత్సకు అయ్యే వ్యయాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్స.జవహర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తంగా 15 కొవిడ్-19 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ కింద చేసేందుకు ట్రస్ట్ సీఈవో సిద్ధం చేసిన మార్గదర్శకాలను టెక్నికల్ కమిటీ ఆమోదించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ పాజిటివ్ కేసులకు, అనుమానితులకు చికిత్స చేసేందుకు ఐసొలేషన్ గదులు, వార్డులు, బ్లాకులు సిద్ధం చేసుకోవాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు వారి అవసరాలకు అనుగుణంగాప్రైవేట్ ఆస్పత్రులను వారి పరిధిలోకి తీసుకునే అవకాశం కల్పించింది.
ఆరోగ్యశ్రీ రోగులు ప్రత్యేక గది తీసుకుంటే రోజుకు రూ.600వరకూ చార్జ్ చేయవచ్చు. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలను ప్రభు త్వం విడుదల చేసిం ది. రోగులకున్న లక్షణాలను బట్టి వారిని కేటగిరీల వారీగా పరిగణిస్తారు. వారికి అందించే చికిత్సను బట్టి ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను... కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించేవి, కరోనా రోగులతో పాటు ఇతరులకు చికిత్స అందించేవి, సాధారణ రోగులకు చికిత్స అందించేవిగా వర్గీకరిస్తారు. రోగులు ఎలాంటి సమస్యతో వచ్చినా వెంటనే అడ్మిట్ చేసుకోవాలి. కరోనా టెస్ట్ కోసం ఎదురుచూడకుండా వెంటనే వారికి చికిత్స అందించాలి. ఇలాంటి వారికి పాజిటివ్ వస్తే కరోనా ఆస్పత్రులకు తరలించాలి. అనుమానితులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి. వాటి ఫలితాలను ఆరోగ్యశాఖ అధికారులకు పంపించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో లేని ఆస్పత్రులు బాధితుల వివరాలను, చికిత్సకు సంబంధించిన వివరాలను జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ఆస్పత్రి కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.